Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లోకి.. రూ.3,125 కోట్ల విడుదలకు ప్రభుత్వం సిద్ధం!
Annadata Sukhibhava: రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చే లక్ష్యంతో అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
రైతులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్.. సుఖీభవ–పీఎం కిసాన్ నిధుల విడుదల..
అన్నదాతకు అండగా ప్రభుత్వం.. తొలి విడతగా ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు..
అమరావతి: రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చే లక్ష్యంతో అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిధులను విడుదల చేయనున్నారు.
ఈ విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తం రూ.3,125.47 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.2,342.92 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద రూ.782.55 కోట్లను అందిస్తోంది.
లబ్ధిదారుల్లో 45,69,817 మంది భూ యజమాని రైతులు, 1,16,021 మంది అటవీ హక్కుల చట్టం (RoFR) కింద సాగు చేస్తున్న రైతు కుటుంబాలు ఉన్నారు.
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా రూ.6 వేలు సమకూరుస్తున్నాయి. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతులకు అందిస్తున్నారు.
2026–27 సంవత్సరపు తొలి విడతలో భాగంగా ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు జమ కానున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల చొప్పున అందించనున్నాయి.
గత ఏడాది కూడా ఈ పథకం కింద ప్రభుత్వం భారీగా నిధులు పంపిణీ చేసింది. 2025–26లో మొత్తం రూ.8,985.41 కోట్లను రైతులకు అందించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.6,560.18 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2,425.23 కోట్లుగా ఉంది.
రైతులకు నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చేరుకోనున్నారు.
ఉదయం 11.55 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు లింగంగుంట్ల చేరుకుంటారు. అనంతరం 12.30 గంటలకు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలిస్తారు.
మధ్యాహ్నం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 3.45 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు.
సాయంత్రం 3.50 గంటలకు జరిగే ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల నుంచి బయలుదేరి రాత్రి 6.20 గంటలకు క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
Tags
Be the first to react