Kollu Ravindra: అమర్నాథ్ గౌడ్కు ఘన నివాళి.. గత పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు!
Kollu Ravindra: వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలకు అమర్నాథ్ గౌడ్ హత్య ఒక ఉదాహరణ అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అమర్నాథ్ గౌడ్ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నంలోని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
అమర్నాథ్ గౌడ్ హత్య వైసీపీ అరాచక పాలనకు నిదర్శనం: మంత్రి కొల్లు రవీంద్ర..
బడుగు బలహీన వర్గాలను వేధించిన గత పాలనపై తీవ్ర విమర్శలు..
మచిలీపట్నం: వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలకు అమర్నాథ్ గౌడ్ హత్య ఒక ఉదాహరణ అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అమర్నాథ్ గౌడ్ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నంలోని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
భారీ ర్యాలీగా చేరుకున్న మంత్రి కొల్లు రవీంద్ర, పార్టీ నాయకులు అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు.
పదో తరగతి చదువుతున్న అమర్నాథ్ గౌడ్ తన అక్కను వేధిస్తున్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం తప్పా అని మంత్రి ప్రశ్నించారు. ట్యూషన్కు వెళ్తున్న సమయంలో అతడిపై దాడి చేసి దారుణంగా హత్య చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ ఘటనలో నిందితులు బెయిల్పై బయటకు వచ్చి బెదిరింపులకు పాల్పడటం పరిస్థితి తీవ్రతను చూపుతోందని వ్యాఖ్యానించారు.
గతంలో కూడా అనేక దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయని మంత్రి ఆరోపించారు. డాక్టర్ సుధాకర్ ఘటన, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య వంటి ఘటనలను ప్రస్తావిస్తూ ప్రజలు వాటిని మరచిపోలేదన్నారు. వైసీపీ నేతల వేధింపులతో కొందరు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు.
ప్రజలకు ఇచ్చిన నమ్మకాన్ని కోల్పోవడంతోనే ప్రజలు గత ప్రభుత్వాన్ని తిరస్కరించారని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలపై ఎలాంటి దాడులు జరిగినా వేగంగా స్పందించి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
గత పాలనలో పోలీసు వ్యవస్థపై కూడా ఒత్తిడి ఉండేదని మంత్రి విమర్శించారు. అధికారులను కులం, మతం పేరుతో వేధించే పరిస్థితులు ఉండేవని ఆరోపించారు.
డీఎస్సీ నియామకాలపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు ఎన్నో కేసులు వచ్చినా వాటిని పరిష్కరించి నియామకాలు పూర్తి చేశామని చెప్పారు.
స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై వస్తున్న ఆరోపణలను కూడా మంత్రి ఖండించారు. క్రీడా కోటాకు సంబంధించిన నిబంధనలు తెలియకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలతో రాజకీయ కుట్రలు చేశారని అన్నారు.
కుట్రలు, ఆరోపణలు కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేసే రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, సీనియర్ నాయకులు కొనకళ్ల జగన్నాథరావు, జిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Be the first to react