Minister Savitha: రెండేళ్లలో అభివృద్ధి పరుగులు.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!
Minister Savitha: ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి విధ్వంస పాలన సాగించిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత విమర్శించారు.
వైసీపీ విధ్వంస పాలనపై చర్చకు సిద్ధం.. జగన్కు మంత్రి సవిత సవాల్..
గ్రామాల నుంచి రాజధాని వరకు అభివృద్ధే లక్ష్యం.. చంద్రబాబు పాలనపై మంత్రి సవిత ప్రశంసలు..
పుట్టపర్తి: ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి విధ్వంస పాలన సాగించిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత విమర్శించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆమె అన్నారు.
పుట్టపర్తిలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం-2 పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు.
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలో విధ్వంస పాలన సాగించారని మంత్రి సవిత ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇచ్చిందని, బీసీ సంక్షేమ శాఖ ద్వారా గతంలో అమలు కాని అనేక కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ విద్యాసంస్థలు, హాస్టళ్లు, గురుకులాల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని మంత్రి చెప్పారు. అభివృద్ధి విషయంలో వైసీపీ నాయకులతో ఎక్కడైనా, ఏ శాఖపైనైనా చర్చకు సిద్ధమని జగన్కు సవాల్ విసిరారు.
పంచాయతీ రాజ్ శాఖ పనులపై స్పందించిన మంత్రి సవిత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు.
2014-19 మధ్య పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారని, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో గ్రామాల్లో బీటీ, సిమెంట్ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు.
2019-24 మధ్య గ్రామీణ రహదారుల అభివృద్ధి ఎందుకు జరగలేదని ప్రశ్నించిన మంత్రి, అప్పట్లో పీఆర్ శాఖ నిద్రపోయిందా అని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజల ఆశీస్సులతో భవిష్యత్తులో కూడా ఇదే దిశగా ముందుకు సాగుతామని మంత్రి సవిత తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు, పరిటాల సునీత, పల్లె సింధూర రెడ్డి, ఎంపీ బీకే పార్థసారథి తదితర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Be the first to react