Kollu Ravindra: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. మంత్రి కొల్లు రవీంద్ర!
Kollu Ravindra: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విశాఖపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ సిబ్బంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున పరిహారం చెక్కులను మంత్రి అందించారు.
విధి నిర్వహణలో మరణించిన ఎక్సైజ్ సిబ్బంది కుటుంబాలకు పరిహారం చెక్కుల పంపిణీ..
ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం.. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది..
ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విశాఖపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ సిబ్బంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున పరిహారం చెక్కులను మంత్రి అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖను రెండు భాగాలుగా విభజించడం వల్ల సిబ్బంది ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థను మళ్లీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. పెద్దాపురం ఎక్సైజ్ స్టేషన్కు చెందిన ఎ.వి.వి. సత్యన్నారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఆయన కుటుంబానికి ఎస్బీఐ ద్వారా మంజూరైన రూ.కోటి నష్టపరిహారం చెక్కును అందించినట్లు తెలిపారు.
అలాగే విజయవాడకు చెందిన దివంగత సి.హెచ్. పిచ్చేశ్వరరావు కుటుంబానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ.కోటి ఆర్థిక సహాయం అందించడం ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.
విశాఖపట్నం సీతమ్మధార ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ ఎల్. సింహాచలం నాయుడు కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు, ఎస్బీఐ ఇన్సూరెన్స్ ద్వారా రూ.10 లక్షలు, ఎక్సైజ్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ ద్వారా రూ.22.72 లక్షలు అందించామని తెలిపారు. ప్రభుత్వం తరఫున మరో రూ.కోటి ఆర్థిక సహాయం త్వరలో అందిస్తామని వెల్లడించారు.
అన్నమయ్య జిల్లా రామసముద్రం చెక్పోస్ట్లో విధులు నిర్వహిస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎ. రెడ్డయ్య అనారోగ్యంతో మరణించడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ తరఫున రూ.10 లక్షల బీమా, ఎక్సైజ్ శాఖ నుంచి రూ.5 లక్షలు, సిబ్బంది విరాళాల ద్వారా రూ.5 లక్షలు అందిస్తున్నామని తెలిపారు. కుటుంబానికి ఇంటి స్థలం, అర్హత కలిగిన సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రూ.21 వేల కోట్ల బకాయిలను చెల్లించామని మంత్రి పేర్కొన్నారు. రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఉద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Be the first to react