Minister Narayana: ఘన వ్యర్థాల నిర్వహణపై అధ్యయనం కోసం మలేషియాకు చేరుకున్న మంత్రి నారాయణ!
Minister Narayana: ఘన వ్యర్థాల నిర్వహణలో అనుసరిస్తున్న ఆధునిక విధానాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రెండు రోజుల పర్యటన నిమిత్తం మలేషియాకు చేరుకున్నారు.
కౌలాలంపూర్లో భారత హైకమిషన్ అధికారులు స్వాగతం.. వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ల పరిశీలన..
కేడీఈబీ వేస్ట్ మేనేజ్మెంట్ విధానాలను పరిశీలించిన మంత్రి నారాయణ..
అమరావతి: ఘన వ్యర్థాల నిర్వహణలో అనుసరిస్తున్న ఆధునిక విధానాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రెండు రోజుల పర్యటన నిమిత్తం మలేషియాకు చేరుకున్నారు.
కౌలాలంపూర్లోని భారత హైకమిషన్ కార్యాలయంలో మంత్రి నారాయణకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా మలేషియాలో అమలు చేస్తున్న వ్యర్థాల నిర్వహణ విధానాలను పరిశీలించనున్నారు.
మంత్రి నారాయణను మలేషియాలోని క్లాంగ్ ఎంపీ గణపతిరావు, మంత్రి పప్పారాయుడు కలిసి పలు అంశాలపై చర్చించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు అధికారులు తెలిపారు.
పర్యటనలో భాగంగా మంత్రి సెలంగార్లోని KDEB వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మలేషియా అధికారులు సంస్థ పనితీరు, వ్యర్థాల సేకరణ, శుద్ధి విధానాలపై మంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఇళ్ల నుంచి, పరిశ్రమల నుంచి వచ్చే ఘన వ్యర్థాలను KDEB సంస్థ సమర్థవంతంగా నిర్వహిస్తున్న తీరును మంత్రి పరిశీలించారు. వ్యర్థాల వేరు చేయడం, రీసైక్లింగ్, శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహణ వంటి అంశాలపై అధికారులు వివరించారు.
మధ్యాహ్నం మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో వివిధ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను సందర్శించనున్నారు. బయో మెడికల్ వేస్ట్, ఇండస్ట్రియల్ మెడికల్ వేస్ట్, పౌల్ట్రీ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను పరిశీలించి అక్కడి విధానాలను అధ్యయనం చేయనున్నారు.
మలేషియాలో అమలు చేస్తున్న ఆధునిక వ్యర్థాల నిర్వహణ పద్ధతులను రాష్ట్రంలో కూడా ఉపయోగించుకునే అవకాశాలను ఈ పర్యటన ద్వారా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంత్రి నారాయణ వెంట మలేషియా పర్యటనలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉన్నారు.
Tags
Be the first to react