Nara Lokesh: క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టండి.. ఐటీసీకి మంత్రి లోకేష్ ఆహ్వానం!
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్ల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టాలని ఐటీసీ సంస్థను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు.
క్రాప్ వాల్యూ చైన్, అగ్రి ఫారెస్ట్రీలో ఏపీతో కలిసి పనిచేయండి: లోకేష్..
361 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్న ఐటీసీ.. ఏపీ ప్రతిపాదనలపై సానుకూల స్పందన..
కోల్కతా: ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్ల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టాలని ఐటీసీ సంస్థను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. కోల్కతాలో ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరితో మంత్రి సమావేశమై రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో హాస్పిటాలిటీ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నంలో సుమారు 220 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకుని ఇప్పటికే పనులు ప్రారంభించాయని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్ల ఏర్పాటులో ఐటీసీ భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా కొత్త వంగడాల అభివృద్ధి, అగ్రి ఫారెస్ట్రీ, ఆదర్శ గ్రామాల నిర్మాణం వంటి రంగాల్లో కలిసి పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రైతులకు మేలు చేసే విధంగా వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే తమ సంస్థ పలు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. గుంటూరులో స్పైసెస్ ప్రాసెసింగ్, గ్రీన్ లీఫ్ టొబాకో ప్రాసెసింగ్ ప్లాంట్లు, అగ్రి బిజినెస్ సెంటర్లు, గొల్లపూడిలో నోట్బుక్ తయారీ యూనిట్, ఐటీ సొల్యూషన్స్, స్టార్ హోటల్స్ వంటి విభాగాల్లో సంస్థ సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని 361 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నామని సంజీవ్ పూరి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు పెద్ద సంఖ్యలో ఆర్ఓ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించి ముందుకు వెళ్తామని ఐటీసీ చైర్మన్ పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమల రంగాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఐటీసీ ఆసక్తిగా ఉందని ఈ సమావేశంలో స్పష్టమైంది.
Tags
Be the first to react