Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ లేటెస్ట్ అప్డేట్... మీ ఖాతాలో డబ్బులు పడేది అప్పుడే!
Annadata Sukhibhava: ఏపీ ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ. 20,000 (పీఎం కిసాన్ రూ. 6,000 తో కలిపి) పెట్టుబడి సాయం అందించనుంది. జూన్ నెలాఖరులోగా మొదటి విడత నిధులు విడుదల కానున్నాయి. బ్యాంక్ ఖాతా లేదా ఆధార్ వివరాల్లో తప్పులు ఉన్న రైతులు వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రం (RSK) లేదా సచివాలయంలో వాటిని సరిచేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, పెద్ద వాహనాలు ఉన్నవారికి ఈ పథకం వర్తించదు.
- జూన్ ఆఖరి కల్లా ‘అన్నదాత సుఖీభవ’ నిధులు
- సాగు పనుల వేళ పెట్టుబడి సాయం
- మీ ఆధార్, ఈ-కేవైసీ సరిచూసుకోండి..
Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. నైరుతి రుతుపవనాలు విస్తరించి వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు పొలం పనుల్లో బిజీ అయ్యారు. ఈ తరుణంలో నూతన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేయడానికి వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. జూన్ నెలాఖరు నాటికే మొదటి విడత నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలనే లక్ష్యంతో అధికారులు రాత్రింబగళ్లు పనిచేస్తున్నారు.
ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 20,000 పెట్టుబడి సాయం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ రూ. 6,000 నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ. 14,000 కలిపి ఈ మొత్తాన్ని విడతలవారీగా అందిస్తుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఈ డబ్బులు చేతికి అందితే విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు ఇబ్బంది ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా నిధులు విడుదల చేయడానికి నిబంధనలను సరళతరం చేస్తోంది.
సాంకేతిక కారణాలు మరియు వివరాల్లో తప్పుల వల్ల ఏ ఒక్క అర్హుడు కూడా నష్టపోకూడదని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో వివరాలు తప్పుగా నమోదవడం లేదా ఆధార్ అనుసంధానం కాకపోవడం వల్ల చాలా మందికి పీఎం కిసాన్ నిధులు నిలిచిపోయాయి. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం రైతులకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించింది. లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉండి, బ్యాంక్ ఖాతా లేదా ఆధార్ వివరాల్లో తప్పులు ఉన్నవారు వాటిని వెంటనే సరిచేసుకోవాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.
రైతులు తమ భూమి రికార్డులకు ఆధార్ నంబర్ను అనుసంధానం చేసుకోవడంతో పాటు పీఎం కిసాన్ ఈ-కేవైసీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాలను (ఆర్ఎస్కే) గానీ, గ్రామ సచివాలయాలను గానీ సంప్రదించవచ్చు. అక్కడ ఉన్న వ్యవసాయ సహాయకులు రైతులకు అందుబాటులో ఉండి ఈ తప్పుల సవరణ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, భూమి పత్రాలను వెంట తీసుకెళ్లడం ద్వారా ఈ పనులను సులువుగా పూర్తి చేసుకోవచ్చు.
ఈ పథకం కేవలం అర్హులైన పేద, మధ్యతరగతి రైతులకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే వారు ఈ సాయానికి అర్హులు కారు. అలాగే నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారిని కూడా ఈ జాబితా నుండి మినహాయించారు. అనర్హుల చేతుల్లోకి నిధులు వెళ్లకుండా క్షేత్రస్థాయిలో గట్టి నిఘా పెడుతూనే, నిరుపేద రైతులకు సకాలంలో లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది.
Be the first to react