Chandrababu: సింగపూర్లో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. స్టార్టప్ పెట్టుబడులకు ఏపీని వేదికగా మార్చే దిశగా అడుగులు!
Chandrababu: సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సింగపూర్లోని భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులే, మంత్రి పి. నారాయణతో పాటు పలువురు స్టార్టప్ పెట్టుబడిదారులు పాల్గొన్నారు.
అభివృద్ధి బాటలో భారత్.. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అపార అవకాశాలు: చంద్రబాబు..
స్టార్టప్లకు స్వర్గధామంగా ఏపీ.. యువశక్తే రాష్ట్రానికి అతిపెద్ద బలం అన్న సీఎం..
సింగపూర్: సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సింగపూర్లోని భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులే, మంత్రి పి. నారాయణతో పాటు పలువురు స్టార్టప్ పెట్టుబడిదారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధునిక ఆలోచనలతో దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.
చైనా వంటి దేశాలు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి దశాబ్దాల సమయం తీసుకున్నాయని, కానీ భారత్ తక్కువ సమయంలోనే వేగవంతమైన వృద్ధి సాధిస్తోందని సీఎం పేర్కొన్నారు. మెడికల్ టెక్నాలజీతో పాటు ఆధునిక పరికరాల తయారీ రంగంలో భారత్ ముందంజలో ఉందన్నారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయని, 5వ తరం యుద్ధ విమానాల తయారీ వంటి రంగాల్లో కూడా దేశం ముందుకు సాగుతోందని చెప్పారు.
భారత్కు అతిపెద్ద యువశక్తి అనే డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్ ఉందని, నైపుణ్యం కలిగిన మానవ వనరులు దేశానికి ప్రధాన బలమని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు "వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్" విధానాన్ని అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. ప్రాజెక్టులకు అవసరమైన భూముల కోసం భూ సమీకరణ విధానాన్ని తీసుకొచ్చామని, అమరావతి రాజధాని కూడా ఇదే విధానంతో నిర్మాణం అవుతోందని తెలిపారు.
ఆమ్కా, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి ప్రముఖ సంస్థలకు రాష్ట్రంలో వేగంగా అనుమతులు ఇచ్చి భూములు కేటాయించామని చెప్పారు. పరిశ్రమలు, స్టార్టప్లు ఏర్పాటుకు ఇదే సరైన సమయమని, పెట్టుబడిదారులు ఏపీ వైపు రావాలని సీఎం పిలుపునిచ్చారు. శ్రీసిటీ వంటి ప్రత్యేక పారిశ్రామిక ప్రాంతాలు భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. పౌర సేవల నుంచి పరిపాలన వరకు అన్ని రంగాల్లో టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నామని చెప్పారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా కొత్త ఆవిష్కరణలకు, పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. ఈ హబ్ నుంచి వచ్చే స్టార్టప్లకు వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులు అందించి ప్రోత్సహించాలని కోరారు. అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని, ఆంధ్రప్రదేశ్ను స్టార్టప్లు, పరిశ్రమలకు అనుకూలమైన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Be the first to react