Kollu Ravindra: అన్నమయ్య జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన.. మైనింగ్ రంగ అభివృద్ధిపై దృష్టి!
Kollu Ravindra: రాష్ట్ర మైనింగ్ రంగాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి పరిశీలించారు.
సహజ వనరుల వినియోగంతో రాష్ట్ర ఆర్థిక పురోగతికి కృషి చేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర..
మదనపల్లి ఖనిజ సంపదకు అంతర్జాతీయ మార్కెట్ కల్పిస్తాం: మంత్రి..
మదనపల్లి: రాష్ట్ర మైనింగ్ రంగాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకొచ్చి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిలిచిపోయిన మైనింగ్ లీజులను తిరిగి ప్రారంభించి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
గత ఐదేళ్లలో మైనింగ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, సహజ వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని మంత్రి ఆరోపించారు. క్వారీ యజమానులపై తప్పుడు కేసులు పెట్టడం, వేధింపులకు గురిచేయడం, పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఒత్తిడి చేయడం వంటి చర్యలు గతంలో జరిగాయని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని మంత్రి తెలిపారు. నిలిచిపోయిన గనులను తిరిగి ప్రారంభించడం ద్వారా మైనింగ్ రంగంలో 40 శాతం అదనపు ఆదాయం సాధించామని చెప్పారు.
మదనపల్లి ప్రాంతంలో క్వార్ట్జ్, లైమ్ స్టోన్, గ్రానైట్, ఐరన్ ఓర్ వంటి విలువైన ఖనిజ సంపద ఉందని, వీటికి వాల్యూ ఎడిషన్ చేసి అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు.
వడ్డెర సామాజిక వర్గం అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. గతంలో అన్న ఎన్టీఆర్ హయాంలో క్వారీ లీజుల్లో వడ్డెరలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారని, ఆ తర్వాత ఆ రిజర్వేషన్ తొలగించడంతో ఆ వర్గానికి నష్టం జరిగిందని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మళ్లీ రిజర్వేషన్ అమలు చేసి వడ్డెరలకు ఆర్థికంగా అండగా నిలుస్తోందని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన క్వారీలను గుర్తించి పునఃప్రారంభించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మైనింగ్ రంగంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక విజిలెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేసి పర్యవేక్షణ పెంచుతున్నామని మంత్రి వివరించారు.
మైనింగ్ ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. సహజ వనరులను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
Be the first to react