Minister Savitha: ప్రజా సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు!
Minister Savitha: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలు ఎక్కువగా కనిపించాయని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత విమర్శించారు.
రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమంలో కొత్త అధ్యాయం: మంత్రి సవిత..
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన కూటమి ప్రభుత్వం: సవిత..
పెనుకొండ: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలు ఎక్కువగా కనిపించాయని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత విమర్శించారు.
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే నాయకుడని, యువత ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపన వంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని చెప్పారు.
పెనుకొండ నియోజకవర్గంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన విధానాలకు చాలా తేడా ఉందని మంత్రి సవిత విమర్శించారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడం ప్రజలు మరచిపోలేని ఘటన అని అన్నారు. ఆ చర్యతోనే కూల్చివేతల రాజకీయాలకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు.
గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని, నిరుద్యోగ యువతకు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ పేరుతో హామీలు ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. డీఎస్సీ నియామకాల విషయంలో కూడా అనవసర ఆరోపణలు చేస్తూ ప్రతిభ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులను అవమానించే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.
ఒకప్పుడు కరవుకు పేరుగాంచిన రాయలసీమను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్, పారిశ్రామిక కేంద్రం, డ్రోన్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రాయలసీమలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమలు, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి ప్రముఖ కంపెనీలు ఏర్పాటు కావడానికి ప్రభుత్వ కృషి కారణమని పేర్కొన్నారు. కృష్ణా జలాలను కుప్పం వరకు తీసుకెళ్లడం కూడా అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై రాజకీయ విమర్శలు చేస్తున్నవారు గతంలో తీసుకున్న నిర్ణయాలను కూడా గుర్తు చేసుకోవాలని మంత్రి సవిత అన్నారు. స్టీల్ ప్లాంట్ భూముల విషయంలో గత ప్రభుత్వ చర్యలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు.
అన్నమయ్య డ్యామ్ ఘటన, పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల సమయంలో అప్పటి ప్రభుత్వ స్పందనపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి సవిత తెలిపారు.
Tags
Be the first to react