Rains: రాయలసీమలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం.. వర్షాలు-వడగాల్పులపై ఏపీఎస్డీఎంఏ హెచ్చరిక!
Rains: ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాల రాకకు తొలి సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD), ఆర్టీజీఎస్-అవేర్ పోర్టల్ విశ్లేషణల ప్రకారం శనివారం నాటికి నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను తాకినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఒకవైపు రుతుపవనాలు.. మరోవైపు వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు..
పల్నాడు, కర్నూలు, అనంతపురంలో పిడుగులతో వర్షాలు.. 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాల రాకకు తొలి సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD), ఆర్టీజీఎస్-అవేర్ పోర్టల్ విశ్లేషణల ప్రకారం శనివారం నాటికి నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను తాకినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రానున్న రెండు నుంచి మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో మొత్తం వర్షపాతం సాధారణ స్థాయి కంటే కొంత తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, స్థానిక వాతావరణ ప్రభావాలతో కురిసే వర్షాలు ఆ లోటును కొంత మేర భర్తీ చేసే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈసారి రుతుపవనాల ప్రయాణంలో తరచూ విరామాలు ఉండే అవకాశం ఉందని, కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసి మళ్లీ కొన్ని రోజులు పొడి వాతావరణం కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. రైతులు ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పంటల ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు.
విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలంలో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.
అయితే ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో మాత్రం సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
జూన్ 7న పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. జూన్ 8న కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
వర్షాల అంచనాలతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం కొనసాగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, కాకినాడ జిల్లాల పరిధిలో మొత్తం 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 104 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది.
అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండవచ్చని పేర్కొన్నారు.
శనివారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా పెదపారుపూడి, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.9 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 43.4 డిగ్రీలు, అనకాపల్లి మాకవరపాలెం, నెల్లూరు గూడూరు, తిరుపతి ఓజిలిలో 43.2 డిగ్రీలు నమోదయ్యాయి.
పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని అధికారులు సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మేఘావృత పరిస్థితులు కనిపించిన వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని హెచ్చరించారు.
వర్షాల కారణంగా తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే ఎండ తీవ్రత దృష్ట్యా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు అవసరం లేకుండా ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, తాగునీరు ఎక్కువగా తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ఒకవైపు రుతుపవనాల రాకతో వర్షాల ఆశలు కనిపిస్తున్నా, మరోవైపు ఎండలు, వడగాల్పులు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Be the first to react