Central Govt: కేంద్రం కీలక నిర్ణయం.. నీట్ యూజీ రీ-ఎగ్జామ్ పూర్తయ్యే వరకు టెలిగ్రామ్ బంద్!
Central Govt: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సేవలపై తాత్కాలిక పరిమితులు విధించింది.
నీట్ పరీక్ష భద్రత కోసం కీలక చర్యలు.. తాత్కాలికంగా టెలిగ్రామ్ పరిమితి..
ప్రశ్నపత్రం లీక్ మోసాలకు అడ్డుకట్ట.. టెలిగ్రామ్పై కేంద్రం చర్యలు..
న్యూఢిల్లీ: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సేవలపై తాత్కాలిక పరిమితులు విధించింది.
జూన్ 21న జరగనున్న నీట్ యూజీ రీ-ఎగ్జామ్ పూర్తయ్యే వరకు, అంటే జూన్ 22 వరకు దేశంలో టెలిగ్రామ్ యాప్ వినియోగంపై ఈ పరిమితులు కొనసాగనున్నాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్వాగతించింది.
నీట్ పరీక్షకు సంబంధించి కొందరు మోసగాళ్ల ముఠాలు టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లను దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ముఖ్యంగా పరీక్షల తర్వాత తప్పుడు ప్రచారాలు, ప్రశ్నాపత్రం లీక్లకు సంబంధించిన నకిలీ ఆధారాలను సృష్టించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇప్పటికే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన మెసేజ్లను తర్వాత ఎడిట్ చేసే సదుపాయాన్ని కూడా జూన్ 30 వరకు నిలిపివేయాలని ఆదేశించినట్లు ఎన్టీఏ పేర్కొంది. దీనివల్ల పాత మెసేజ్లను మార్చి కొత్తగా చూపించే అవకాశాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల ప్రయోజనం, ప్రజా శాంతి భద్రతల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. రీ-ఎగ్జామ్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, విద్యార్థులకు న్యాయం జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించింది.
సమయానుకూలంగా చర్యలు తీసుకున్నందుకు కేంద్ర మంత్రిత్వ శాఖకు ఎన్టీఏ కృతజ్ఞతలు తెలిపింది. ఈ నిర్ణయం నీట్ పరీక్షను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సహాయపడుతుందని పేర్కొంది.
Be the first to react