తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 2026 నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ..
14 మంది సభ్యులతో కూడిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు..
అమెరికాలో తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖ ప్రవాస తెలంగాణ సంస్థ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ ట్రస్టీల వివరాలను అధికారికంగా ప్రకటించింది. సంస్థ ప్రెసిడెంట్ డా. భరత్ నరవెట్ల నేతృత్వంలో ఈ కొత్త బృందాన్ని ప్రకటించగా, సంస్థ చైర్మన్గా డా. దివేష్ అనిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
కొత్త కార్యవర్గంలో ప్రెసిడెంట్ ఎలక్ట్గా ప్రీతి జొన్నలగడ్డ ఎంపికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా అర్చన నమిలకొండ, శ్రీనివాస్ రానబోతు, స్వాతి సూదిని బాధ్యతలు చేపట్టనున్నారు. సెక్రటరీగా శ్రీనివాస్ గిల్లేపల్లి, జాయింట్ సెక్రటరీగా రాజేందర్ లంబు, ట్రెజరర్గా విజేందర్ డుంబాల, జాయింట్ ట్రెజరర్గా అవినాష్ కళ్యాణ్కర్ నియమితులయ్యారు. అలాగే పాస్ట్ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ మణికొండ కొనసాగనున్నారు.
ఇవాళ ప్రకటించిన కమిటీలో అమెరికాలోని పలు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 14 మంది సభ్యులతో కూడిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను కూడా సంస్థ పరిచయం చేసింది. తెలంగాణ సమాజ అభివృద్ధికి మరింత సమన్వయంతో పనిచేసేలా ఈ బృందాన్ని రూపొందించినట్లు నాయకత్వం తెలిపింది.
ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ డా. భరత్ నరవెట్ల మాట్లాడుతూ, కొత్తగా బాధ్యతలు చేపట్టిన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యవర్గ సభ్యుల అంకితభావం, నాయకత్వ నైపుణ్యంతో తెలంగాణ సమాజానికి మరింత సేవ చేసే అవకాశాలు విస్తరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలోని తదుపరి తరాలకు చేరవేస్తూనే, సేవా కార్యక్రమాలు, యువత సాధికారత, సామాజిక కార్యక్రమాల్లో కొత్త ఆలోచనలకు ఈ వేదిక మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.