TDP: హోంమంత్రి అనితపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి.. పీతల సుజాత డిమాండ్!
TDP: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు మహిళా సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని మాజీ మంత్రి, ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ ఛైర్పర్సన్ పీతల సుజాత తీవ్రంగా మండిపడ్డారు. అమర్నాథ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అనితపై వ్యక్తిగత విమర్శలు మహిళా సమాజానికి అవమానం: పీతల సుజాత..
మహిళలను అవమానించడం వైసీపీ సంస్కృతికి నిదర్శనం: సుజాత ఫైర్..
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు మహిళా సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని మాజీ మంత్రి, ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ ఛైర్పర్సన్ పీతల సుజాత తీవ్రంగా మండిపడ్డారు. అమర్నాథ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పీతల సుజాత మాట్లాడుతూ.. మహిళలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో భాగమని అన్నారు. ఒక మహిళ వ్యక్తిత్వం, రూపం, ఆత్మగౌరవాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం రాజకీయ విమర్శ కాదని, అది మహిళలపై దాడి అని పేర్కొన్నారు.
దళిత మహిళగా, రాష్ట్ర హోంమంత్రిగా వంగలపూడి అనిత తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆమెపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం రాజకీయ విలువలను దిగజార్చడమేనని విమర్శించారు.
వైసీపీ నేతలు గతంలో కూడా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పీతల సుజాత ఆరోపించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం ఆ పార్టీ నాయకత్వ ధోరణిగా మారిందన్నారు.
మహిళా నాయకులపై సోషల్ మీడియా వేదికగా కూడా అనేక అవమానకర వ్యాఖ్యలు జరిగాయని ప్రస్తావించారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే వ్యక్తిగత దూషణలు చేయడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సాధికారత కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని సుజాత తెలిపారు. స్త్రీశక్తి పథకం, ఉచిత బస్సు ప్రయాణం, దీపం-2.0 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, డ్వాక్రా మహిళలకు సహాయం వంటి కార్యక్రమాలతో మహిళలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు.
మహిళలను అవమానించడం ద్వారా రాజకీయంగా ఎదగలేరని, ప్రజలకు సేవ చేయడం ద్వారానే గౌరవం పొందవచ్చని సూచించారు. “నేను వదిలేసిన కార్లలోనే తిరుగుతున్నారు” అనే అమర్నాథ్ వ్యాఖ్యలపై కూడా పీతల సుజాత స్పందించారు. ప్రభుత్వ వాహనాలు ఎవరి వ్యక్తిగత ఆస్తులు కావని, అవి ప్రజల పన్నుల డబ్బుతో కొనుగోలు చేసిన ప్రజా ఆస్తులని తెలిపారు.
పదవులు ప్రజలు ఇచ్చే బాధ్యతలు మాత్రమేనని, అవి శాశ్వత హక్కులు కావని అన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోతే వారు తిరస్కరిస్తారని పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా లోకం సహించదని, హోంమంత్రి అనితకు క్షమాపణ చెప్పాలని మరోసారి డిమాండ్ చేశారు.
Tags
Be the first to react