Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!
Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి.. మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు..
హామీలు మరిచి రాష్ట్రానికి అన్యాయం చేశారు.. జగన్ పాలనపై కొల్లు రవీంద్ర ఫైర్..
అమరావతి: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వెన్నుపోటుకు, గొడ్డలి వేటుకు జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్గా మారారని ఆయన వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ప్రజా వేదిక కూల్చివేతతోనే ఆయన పాలన ప్రారంభమైందని, ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అనేక రంగాల్లో వెనుకబడిందని అన్నారు.
మద్యం విషయంలో సంపూర్ణ నిషేధం చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మంత్రి ఆరోపించారు. కల్తీ మద్యం, సొంత బ్రాండ్ల పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారని విమర్శించారు. మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి ఖజానా నింపుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై వేల కోట్ల భారం మోపారని, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుతో విద్యుత్ సంస్థలకు నష్టం కలిగించారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ హామీలను అమలు చేయలేదని అన్నారు. విద్యార్థులకు అమ్మఒడి, పేద వర్గాల విద్యకు సంబంధించిన పథకాల విషయంలోనూ మాట తప్పారని విమర్శించారు.
జీవో నెం.117 ద్వారా అనేక పాఠశాలలను రద్దు చేసి బలహీన వర్గాల విద్యార్థులకు నష్టం చేశారని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని రద్దు చేసి విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం నిలిపివేసిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను తగ్గించారని అన్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరిగిందని ఆరోపించారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించారని అన్నారు. రాజధాని రైతులపై అప్పటి ప్రభుత్వం కఠిన చర్యలకు పాల్పడిందని విమర్శించారు.
కుటుంబ విషయాల్లో కూడా జగన్ రెడ్డి వ్యవహారశైలి సరిగా లేదని మంత్రి ఆరోపించారు. సొంత కుటుంబ సభ్యుల విషయంలోనూ అన్యాయం చేశారని, బాబాయి హత్య కేసులో నిందితులకు అండగా నిలిచారని ఆరోపణలు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టిందని కొల్లు రవీంద్ర తెలిపారు. కేంద్రం నుంచి అదనపు నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ వంటి కీలక ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
పరిశ్రమలను ఆకర్షించేందుకు కొత్త పాలసీలు తీసుకొచ్చామని, పెట్టుబడిదారుల్లో రాష్ట్రంపై నమ్మకం పెంచామని అన్నారు. గతంలో పెట్టుబడులకు భయపడిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఏపీ వైపు పరిశ్రమలు వచ్చేలా వాతావరణం ఏర్పడిందని చెప్పారు.
కూటమి ప్రభుత్వం పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్, ఉచిత బస్సు, మత్స్యకారుల సంక్షేమం వంటి పథకాలను అమలు చేస్తోందని మంత్రి వివరించారు. రైతులకు మద్దతు ధర అందించడంతో పాటు దీపం 2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, వివిధ వృత్తుల వారికి ఉచిత విద్యుత్, రిజర్వేషన్లు వంటి ప్రయోజనాలు కల్పిస్తున్నామని చెప్పారు.
ఉద్యోగాల విషయంలో కూడా ప్రభుత్వం ముందడుగు వేసిందని మంత్రి పేర్కొన్నారు. 16,400 డీఎస్సీ పోస్టులు, 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామని, పరిశ్రమల ద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా వంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు ప్రయోజనం కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇళ్ల నిర్మాణంలో కూడా కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి జరిగిన నష్టం ఎక్కువగా ఉందని, ప్రస్తుతం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా తీసుకెళ్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజలు తప్పుడు ప్రచారాలకు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Be the first to react