Modi: ఫ్రాన్స్లో జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్న ప్రధాని మోదీ.. అంతర్జాతీయ సవాళ్లపై కీలక చర్చలు!
Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ ఫ్రాన్స్ చేరుకోనున్నారు.
ప్రపంచ వేదికపై భారత్ సత్తా.. జీ7 సదస్సులో పాల్గొననున్న మోదీ..
శాంతి, భద్రత, అభివృద్ధిపై జీ7 వేదికగా భారత్ కీలక పాత్ర..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ ఫ్రాన్స్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జీ7 దేశాల నేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులతో కలిసి అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధాని మోదీకి అధికారిక స్వాగతం పలకనున్నారు. అనంతరం “కొత్త భాగస్వామ్యాల నిర్మాణం, అంతర్జాతీయ ఐక్యత పునర్నిర్మాణం” అనే అంశంపై జరిగే జీ7 సమావేశంలో ప్రధాని పాల్గొంటారు. ఈ సమావేశంలో జీ7 దేశాల నేతలతో పాటు ప్రపంచ బ్యాంకు, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.
జీ7 సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఏర్పాటు చేసే విందులో ప్రధాని పాల్గొంటారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ పర్యటన చేపడుతున్నారు. జీ7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వసారి కాగా, ప్రధాని మోదీ వరుసగా ఏడోసారి ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో భారత్ పాత్రకు పెరుగుతున్న గుర్తింపుకు ఇది నిదర్శనంగా భావిస్తున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో జీ7 దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడుతున్నాయి. వాణిజ్యం, సాంకేతికత, ఆవిష్కరణలు, తయారీ రంగం, సరఫరా వ్యవస్థల విషయంలో భారత్ కీలక భాగస్వామిగా మారుతోందని అధికారులు తెలిపారు.
ఇటీవల భారత్-యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం, నైస్లో జరిగిన “భారత్ ఇన్నోవేట్స్” కార్యక్రమం, పారిస్లో జరగనున్న వివాటెక్ కార్యక్రమంలో భారత్ అధికారిక ఏఐ భాగస్వామ్య దేశంగా ఉండటం వంటి పరిణామాలు భారత్ సామర్థ్యాలను ప్రపంచానికి చాటుతున్నాయని పేర్కొన్నారు.
ఫ్రాన్స్ జీ7 అధ్యక్షతన గుర్తించిన అసమానతల తగ్గింపు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, కృత్రిమ మేధస్సు వంటి అంశాలు భారత్ అభివృద్ధి లక్ష్యాలతో సరిపోతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ పర్యటన ద్వారా భారత్-జీ7 దేశాల మధ్య సహకారం మరింత బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Be the first to react