Fuel: రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి భారీగా ఇంధనం కొనుగోలుపై కేంద్రం ఆంక్షలు!
Fuel: అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ లభ్యతను నిరంతరం కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
90 రోజుల పాటు అమల్లో ఉండనున్న తాత్కాలిక నిబంధనలు.. స్థానిక కొరత నివారణే లక్ష్యం..
సంస్థలు, పరిశ్రమలకు రిటైల్ బంకుల నుంచి పెట్రోల్-డీజిల్ కొనుగోలుపై పరిమితులు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ లభ్యతను నిరంతరం కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులు భారీ మొత్తంలో మోటార్ స్పిరిట్ (పెట్రోల్), హై స్పీడ్ డీజిల్ (డీజిల్) కొనుగోలు చేయకుండా కేంద్రం ఆంక్షలు విధించింది.
ప్రస్తుతం కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసుల్లో ప్రభావం కనిపిస్తోంది. దీని వల్ల దేశీయంగా స్థానిక కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది.
కొత్త నిబంధనల ప్రకారం పెద్ద మొత్తంలో ఇంధనం అవసరమయ్యే సంస్థలు, పరిశ్రమలు తమ అవసరాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వినియోగదారుల పెట్రోల్ పంపుల (Consumer Pumps) నుంచే ఇంధనం పొందాల్సి ఉంటుంది. సాధారణ ప్రజలు, రైతులు, అత్యవసర సేవలకు ఇబ్బందులు కలగకుండా రిటైల్ బంకుల వద్ద ఇంధన విక్రయాలను క్రమబద్ధీకరించనున్నారు.
రిటైల్ అవుట్లెట్లలో ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల వరకు హై స్పీడ్ డీజిల్ మాత్రమే విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిమితి భారీగా నిల్వ చేసుకోవడం, అనవసర కొనుగోళ్లను అరికట్టేందుకు తీసుకున్న చర్యగా అధికారులు వెల్లడించారు.
పెట్రోల్, డీజిల్ వంటి అవసరమైన ఇంధనాలు రవాణా, వ్యవసాయ పనులు, అత్యవసర సేవలు, దేశ భద్రతకు కీలకమైనవని కేంద్రం పేర్కొంది. అందరికీ సమానంగా, సరసమైన ధరలకు ఇంధనం అందుబాటులో ఉండేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
ఈ ఆంక్షలు తాత్కాలికంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. సంక్షోభ సమయంలో కొందరు అక్రమంగా ఇంధనం నిల్వ చేయడం, అధికంగా కొనుగోలు చేయడం వల్ల సాధారణ వినియోగదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని పలు రాష్ట్రాలు కూడా కేంద్రం దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొంది.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పెట్రోల్ బంక్ డీలర్లు కొత్త నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది.
Tags
Be the first to react