Modi: ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధికి కొత్త బాటలు!
Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్ల కాలంలో దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి, మౌలిక వసతుల పరంగా గణనీయమైన మార్పులను సాధించాయని కేంద్రం పేర్కొంది.
ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన ఈశాన్యం.. ఇప్పుడు అభివృద్ధికి చిరునామా..
ఈశాన్య రాష్ట్రాల్లో కనెక్టివిటీ విప్లవం.. రోడ్లు, రైళ్లు, విమాన మార్గాల్లో భారీ పురోగతి..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్ల కాలంలో దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి, మౌలిక వసతుల పరంగా గణనీయమైన మార్పులను సాధించాయని కేంద్రం పేర్కొంది. “సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్” స్ఫూర్తితో ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపింది.
గతంలో హింస, బంద్లు, నిర్లక్ష్యంతో గుర్తింపు పొందిన ఈశాన్య ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి, పర్యాటకం, పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందని వెల్లడించింది. ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రధాని మోదీ గత 12 ఏళ్లలో 83 సార్లకు పైగా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించినట్లు తెలిపింది.
ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు రోడ్లు, రైలు, విమాన మార్గాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ.47,270 కోట్లకు పైగా ఖర్చు చేసి 46,290 కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులను నిర్మించారు.
విమాన రవాణా రంగంలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గత 12 ఏళ్లలో ఎనిమిది కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు అభివృద్ధి చేశారు. 2014లో 9 విమానాశ్రయాలు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 17కు చేరింది. ఉడాన్ పథకం ద్వారా 90 విమాన మార్గాలు, 12 విమానాశ్రయాలు, హెలిపోర్టులు అందుబాటులోకి వచ్చాయి.
రైల్వే రంగంలో కూడా ఈశాన్య రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రాంతంలో 4,170 కిలోమీటర్లకు పైగా రైల్వే మార్గాలను విద్యుదీకరించారు. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లో 100 శాతం రైల్వే విద్యుదీకరణ పూర్తయింది.
స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా 2022లో మణిపూర్కు, 2023లో మేఘాలయకు, 2025లో మిజోరంకు సరుకు రవాణా రైళ్లు చేరాయి. దీంతో ఈ ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరిగే అవకాశం ఏర్పడింది.
అరుణాచల్ ప్రదేశ్లో విమాన సౌకర్యాలు మెరుగుపడ్డాయని స్థానికులు పేర్కొన్నారు. రోడ్లు, విమాన కనెక్టివిటీ పెరగడంతో పర్యాటకం అభివృద్ధి చెందుతోందని, స్థానికులకు ఆదాయ అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.
ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం పీఎం-డివైన్ పథకం కింద రూ.6,600 కోట్ల నిధులు కేటాయించారు. రహదారులు, రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి.
ప్రధాని మోదీ నాయకత్వంలో ఈశాన్యంలోని ఎనిమిది రాష్ట్రాలు “అష్టలక్ష్మి”గా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని కేంద్రం పేర్కొంది. ఈ ప్రాంతం దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక భాగస్వామిగా మారుతోందని తెలిపింది.
Be the first to react