రైలు ప్రయాణం చేయాలనుకునే సామాన్యుడికి టికెట్ దొరకడం అనేది ఇప్పుడు ఒక యుద్ధంలా మారిపోయింది. కంప్యూటర్ ముందు కూర్చుని బుకింగ్ స్టార్ట్ చేయగానే సెకన్ల వ్యవధిలో టికెట్లు మాయమైపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ 'టికెట్ల దందా'కు, అక్రమ బుకింగ్స్ సాఫ్ట్వేర్లకు అడ్డుకట్ట వేయడానికి భారతీయ రైల్వే (Indian Railways) మరియు ఐఆర్సీటీసీ (IRCTC) నడుం బిగించాయి. ఇందులో భాగంగా 'ఆధార్ అథెంటికేషన్' (Aadhar Authentication) విధానాన్ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
ఐఆర్సీటీసీ యాప్లో లాగిన్ అయ్యే ప్రతి ఒక్కరూ తమ ఆధార్ నంబర్ను లింక్ చేసి, వెరిఫై చేసుకోవడం ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే, అత్యంత రద్దీగా ఉండే సమయాల్లో కేవలం వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటును రైల్వే కల్పిస్తోంది.
గతేడాది అక్టోబర్ 1 నుంచే జనరల్ టికెట్ రిజర్వేషన్కూ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది. ఫలితంగా ఐఆర్సీటీసీ యాప్నకు ఆధార్ లింక్ చేసిన వారు మాత్రమే మొదటి 15 నిమిషాల్లో టికెట్లు బుకింగ్ చేసుకునే వీలు కల్పించారు. డిసెంబర్ 29, 2025 నుంచి ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఆధార్ అథెంటికేషన్ ఖాతాలకే బుకింగ్ సాధ్యమవుతుంది. ఇక ఇప్పుడు ఈ సమయాన్ని మరింత పొడిగించారు.
జనవరి 5వ తేదీ నుంచి 8 గంటల పాటు బుకింగ్ సమయం కల్పిస్తున్నారు. అంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రైన్ టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ సమయంలో కేవలం ఆధార్ అథెంటికేషన్ ఉన్న వెరిఫైడ్ యూజర్లు మాత్రమే టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆధార్ వెరిఫై చేయని వారు ఆ తర్వాత మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల టికెట్ల బుకింగ్ అక్రమాలకు చెక్ పెట్టాలని భారతీయ రైల్వే భావిస్తోంది.
అంతేకాదు, జనవరి 12వ తేదీ నుంచి ఈ సమయం 14 గంటలకు పెరగనుంది. అంటే ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పెంచనున్నారు. ఈ సమయంలో కేవలం ఆధార్ వెరిఫైడ్ ప్రయాణికులు మాత్రమే టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. దీంతో పూర్తిగా అక్రమార్కులకు చెక్ పడనుందని రైల్వే శాఖ అంటోంది.
అటు, తత్కాల్ టికెట్లకు సైతం 2025, జులై 1 నుంచే ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. 2025, జులై 15 నుంచి పీఆర్ఎస్ కౌంటర్లు, ఏజెంట్ల ద్వారా తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసినా ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. అలాగే అడ్వాన్స్ రిజర్వేషన్ సమయంలో బుకింగ్ రూల్స్ కఠినతరం చేశారు.
అయినప్పటికీ సాధారణ ఐఆర్సీటీసీ యూజర్లు తత్కాల్ బుకింగ్స్ వంటి కీలక సమయంలో చేసే బుకింగ్స్ తీరు పెద్దగా మారలేదని పెదవి విరుస్తుండటం గమనార్హం.
టికెట్ల అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయడానికి ఆధార్ లింకింగ్ అనేది ఒక మంచి ముందడుగు. మీరు మీ సంక్రాంతి లేదా వేసవి సెలవుల ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటున్నట్లయితే, వెంటనే మీ ఐఆర్సీటీసీ ఖాతాను ఆధార్తో వెరిఫై చేసుకోండి. లేదంటే కీలకమైన బుకింగ్ సమయాల్లో మీరు టికెట్లు పొందే అవకాశం కోల్పోవచ్చు.