ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూసర్వేలో అనేక తప్పులు జరిగాయని, వాటిని పూర్తిగా సరిదిద్దుతూ కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు ఉచితంగా అందిస్తున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పాసుపుస్తకాల్లో కూడా ఎక్కడైనా తప్పులు ఉంటే, వాటిని కూడా సరిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.
గత రీసర్వేలో 6,688 గ్రామాల్లో సర్వే సరిగ్గా జరగలేదని, 4,783 గ్రామాల్లో భూహక్కుపత్రాల్లో విస్తీర్ణం, సర్వే నంబర్లు, పేర్లు, జాయింట్ ఎల్పీఎం, ఆధార్ వివరాల్లో తప్పులు ఉన్నాయని మంత్రి తెలిపారు. అలాగే మరణించిన పట్టాదారుల స్థానంలో కొత్త హక్కుదారుల పేర్లు చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ లోపాలన్నింటినీ గుర్తించి సరిచేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
గతంలో భూహక్కు పత్రాలపై రాజకీయ గుర్తులు ముద్రించడం రైతుల్లో భయాందోళనలకు కారణమైందని మంత్రి విమర్శించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను హరించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామసభల ద్వారా 7.50 లక్షల ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిష్కరించిన అనంతరం రాజముద్ర, క్యూఆర్ కోడ్తో 22.33 లక్షల కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఉచితంగా అందిస్తోందని తెలిపారు.
పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు నమ్మకం, భరోసా కలిగించేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిచేసి, తప్పుల్లేని పాసుపుస్తకాలు అందించాలన్నారు. పాసుపుస్తకాలు ముద్రించే ముందు గ్రామసభల్లో రైతుల సమక్షంలో భూమి వివరాలను నిర్ధారించుకోవాలని, ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను రైతులకు స్పష్టంగా వివరించాలని అధికారులకు ఆదేశించారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ‘రీ సర్వే 2.0’ను అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. రైతులకు ముందుగా నోటీసులు ఇచ్చి, వారి సమక్షంలోనే భూముల సర్వే చేపడుతున్నామని చెప్పారు. రైతులు అందుబాటులో లేకపోతే వీడియో కాల్ ద్వారా కూడా వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. భూముల కొలతల్లో ఏవైనా అనుమానాలు ఉంటే రైతులు మళ్లీ సర్వే కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.