Kadapa Cricket Stadium: ఏపీలో ఆ క్రికెట్ స్టేడియం బ్యూటీకి నెటిజన్లు ఫిదా.. ధర్మశాలతో పోలిక!
Kadapa Cricket Stadium: కడపలోని పుట్లంపల్లె వైఎస్సార్ క్రికెట్ స్టేడియం ప్రస్తుతం ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL 2026) మ్యాచ్లకు వేదికై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చుట్టూ కొండల అందాలు, ఫ్లడ్లైట్ల వెలుతురుతో ఈ మైదానం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియంను తలపిస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమై, ఏసీఏ (ACA) ఆధ్వర్యంలో 15,000 సీటింగ్ సామర్థ్యంతో రూపుదిద్దుకున్న ఈ అంతర్జాతీయ స్థాయి గ్రౌండ్ భవిష్యత్తులో మరిన్ని పెద్ద మ్యాచ్లకు వేదికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
-
సోషల్ మీడియాను ఊపేస్తోన్న కడప వైఎస్సార్ స్టేడియం డ్రోన్ విజువల్స్!
-
ఆంధ్రా ప్రీమియర్ లీగ్: సరికొత్త హంగులతో వెలుగులీనుతోన్న కడప పిచ్!
-
రాయలసీమ క్రికెట్ హబ్.. న్యూజిలాండ్ గ్రౌండ్లా మెరిసిపోతోన్న కడప స్టేడియం!
Kadapa Cricket Stadium: కడప నగర శివార్లలోని పుట్లంపల్లె వద్ద అత్యాధునిక వసతులతో ముస్తాబైన వైఎస్సార్ క్రికెట్ స్టేడియం ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. చుట్టూ పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ గ్రౌండ్కు సంబంధించిన ఫోటోలు, డ్రోన్ వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రాత్రి వేళల్లో ఫ్లడ్లైట్ల వెలుతురులో ఈ స్టేడియం అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరిస్తోంది. ఈ అందాలను చూసిన క్రీడాభిమానులు భారతదేశంలోనే అత్యంత అందమైన ధర్మశాల స్టేడియంతోనూ, అలాగే న్యూజిలాండ్ దేశంలోని సుందరమైన పిచ్లతోనూ దీనిని పోల్చుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇటీవల ప్రారంభమైన ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL 2026) మ్యాచ్లకు ఈ మైదానం ఆతిథ్యం ఇస్తుండటంతో ఈ స్టేడియం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. జూన్ 17 నుండి జూన్ 21 వరకు ఇక్కడ వరుసగా లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టోర్నీ కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) పిచ్లను, మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఈ స్టేడియం పక్కనే రైల్వే ట్రాక్ ఉండటం వల్ల, ఆ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు కూడా మ్యాచ్ జరుగుతున్న సమయంలో అత్యద్భుతమైన అనుభూతి కలుగుతోంది. మ్యాచ్ వీక్షించడానికి వస్తున్న వేలాది మంది అభిమానులతో కడప నగరం క్రికెట్ పండుగను తలపిస్తోంది.
ప్రస్తుతం ఈ స్టేడియంలో దాదాపు 15,000 మంది ప్రేక్షకులు కూర్చుని మ్యాచ్ను తిలకించేలా గ్యాలరీలను సౌకర్యవంతంగా నిర్మించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిబంధనలకు అనుగుణంగా 85 గజాల బౌండరీ లైన్తో ఈ గ్రౌండ్ను పెద్దదిగా రూపొందించారు. కేవలం మ్యాచ్లు నిర్వహించడమే కాకుండా, భవిష్యత్తులో ఉత్తమ క్రికెటర్లను తయారు చేసేందుకు వీలుగా ఇక్కడ ఒక రెసిడెన్షియల్ క్రికెట్ అకాడమీని కూడా ఏర్పాటు చేయడం విశేషం. రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రేక్షకుల సామర్థ్యాన్ని మరికొంత పెంచితే, త్వరలోనే అంతర్జాతీయ వన్డేలు, టెస్ట్ మ్యాచ్లకు కూడా ఈ వేదిక వేదిక కాగలదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సుందర మైదానానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో ఈ స్టేడియం నిర్మాణ పనులకు పునాది పడింది. కానీ అది అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు ఓటమి ప్రభుత్వం చొరవతో వివిధ దశల్లో పనులు సాగి, కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ల పట్టుదల, సంయుక్త కృషితో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి హంగులను సంతరించుకుంది. రాయలసీమ ప్రాంతంలో ఇంతటి ప్రతిష్టాత్మక క్రీడా ప్రాంగణం అందుబాటులోకి రావడం స్థానిక క్రీడాకారులకు ఎంతో మేలు చేకూరుస్తుంది.
ప్రస్తుత ఏపీఎల్ షెడ్యూల్ ప్రకారం జూన్ 9న వైజాగ్లో ప్రారంభమైన ఈ లీగ్ ప్రయాణం, ఇప్పుడు కడపలో విజయవంతంగా సాగుతోంది. ఈ కడప లీగ్ మ్యాచ్లు ముగిసిన అనంతరం, జూన్ 24 నుండి జూన్ 30 వరకు జరిగే కీలకమైన క్వాలిఫైయర్స్ మరియు ఫైనల్ మ్యాచ్లకు మంగళగిరి స్టేడియం వేదిక కానుంది. అయితే ప్రస్తుతం వేసవి కాలం ముగింపు దశలో ఉన్నప్పటికీ, కడపలో నమోదవుతున్న 45 డిగ్రీల ఎండ తీవ్రత మాత్రం ఆటగాళ్లకు కొంత ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ స్థానిక అభిమానుల ఉత్సాహం, లీగ్ మ్యాచ్ల హోరాహోరీ పోరు ఈ ఎండ వేడిని మర్చిపోయేలా చేస్తోందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి.
Tags
Be the first to react