Kollu Ravindra: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం.. మంత్రి కొల్లు రవీంద్ర!
Kollu Ravindra: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన “రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
అనకాపల్లిలో రెండేళ్ల కూటమి పాలనపై నిర్వహించిన సభలో ప్రభుత్వ కార్యక్రమాలపై వివరణ..
సంక్షోభం నుంచి స్వర్ణాంధ్ర నిర్మాణం వైపు రాష్ట్రం: మంత్రి కొల్లు..
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన “రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి భారీ ర్యాలీలో పాల్గొని అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు.
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యల నుంచి బయటపడి అభివృద్ధి వైపు ప్రయాణం ప్రారంభించామని మంత్రి తెలిపారు. సంక్షోభ పరిస్థితుల నుంచి స్వర్ణాంధ్ర నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పునాదులు వేస్తోందన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను తిరిగి అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.
గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి.. కులం, మతం, ప్రాంతం పేరుతో విభేదాలు సృష్టించి పాలన సాగించారని ఆరోపించారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసక చర్యలు ఐదేళ్ల పాటు కొనసాగాయని, అన్ని రంగాలు నష్టపోయాయని అన్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందని, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారని ఆరోపించారు.
ప్రజల తీర్పుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రజలు మద్దతు ఇచ్చారని మంత్రి తెలిపారు. అధికారం చేపట్టిన సమయంలో ఖాళీ ఖజానా, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ పరిపాలనా అనుభవంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. 63 లక్షల మందికి పెన్షన్ల రూపంలో రెండేళ్లలో రూ.65 వేల కోట్లు చెల్లించామని తెలిపారు. తల్లికి వందనం పథకం కింద 68 లక్షల మందికి రూ.10 వేల కోట్లు అందించామని, త్వరలో మరో విడతగా కూడా నిధులు విడుదల చేయనున్నట్లు చెప్పారు.
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, స్త్రీ శక్తి పథకం కింద ఉచిత గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వడ్డెర వర్గాల కోసం తీసుకున్న చర్యలను వివరించారు.
పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి గ్రావిటీ ద్వారా అన్ని ప్రాంతాలకు నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. అమరావతి పనులు ప్రారంభమయ్యాయని, విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర సహకారంతో రూ.11 వేల కోట్ల సహాయం తీసుకొచ్చి పునరుద్ధరణ చర్యలు చేపట్టామని అన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన రైల్వే జోన్ సాధించామని, అనకాపల్లి జిల్లాలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. గూగుల్, అర్సెలార్ మిట్టల్ వంటి సంస్థల పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.
మెగా డీఎస్సీ ద్వారా 15,430 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టామని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు సరికాదని పేర్కొన్నారు.
గత పాలనలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని ఆరోపించిన మంత్రి.. కూటమి ప్రభుత్వం వాటిని పునరుద్ధరిస్తోందన్నారు. మహిళల భద్రతకు, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
మద్యం విధానంపై కూడా మంత్రి స్పందిస్తూ.. గతంలో జరిగిన అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానం తీసుకొచ్చామని చెప్పారు. కల్తీ మద్యం నియంత్రణ, నాణ్యత పరీక్షలు, అక్రమాలకు అడ్డుకట్ట వేసే చర్యలు చేపట్టామని తెలిపారు.
దేశంలో కొన్ని రాష్ట్రాలు ఒకే ప్రభుత్వం కొనసాగడం వల్ల అభివృద్ధి సాధిస్తున్నాయని ఉదాహరణగా పేర్కొన్న మంత్రి.. రాష్ట్రంలో కూడా అభివృద్ధి కొనసాగాలంటే స్థిరమైన పాలన అవసరమన్నారు. కూటమి ప్రభుత్వం దీర్ఘకాలం కొనసాగి రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలపాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు.
Tags
Be the first to react