Locker Mystery: బ్యాంకు లాకర్‌లో రూ.50 లక్షల విలువైన నగలు.. తెరిచి చూడగా ఖాళీ!

Locker Mystery: బ్యాంకు లాకర్‌లో భద్రంగా ఉంటాయని నమ్మి దాచుకున్న విలువైన నగలు, ఇతర వస్తువులు కనిపించకుండా పోయిన ఘటన కాన్పూర్‌లో కలకలం రేపుతోంది. ఓ మహిళ తన లాకర్‌లో సుమారు రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ఉంచినట్లు చెబుతున్నారు. కొన్నేళ్ల తర్వాత లాకర్ తెరిచి చూడగా అది ఖాళీగా కనిపించిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Locker Mystery
Locker Mystery

SBI లాకర్‌లో రూ.50 లక్షల విలువైన నగలు మాయం.. పోలీసుల దర్యాప్తు..

SBI లాకర్‌లో బంగారు నగలు ఏమయ్యాయి? బ్యాంకు ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్..

కాన్పూర్: బ్యాంకు లాకర్‌లో భద్రంగా ఉంటాయని నమ్మి దాచుకున్న విలువైన నగలు, ఇతర వస్తువులు కనిపించకుండా పోయిన ఘటన కాన్పూర్‌లో కలకలం రేపుతోంది. ఓ మహిళ తన లాకర్‌లో సుమారు రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ఉంచినట్లు చెబుతున్నారు. కొన్నేళ్ల తర్వాత లాకర్ తెరిచి చూడగా అది ఖాళీగా కనిపించిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల ప్రకారం.. బాధిత మహిళ 2003లో కాన్పూర్‌లోని స్వరూప్ నగర్ శాఖలో అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ (SBT)లో లాకర్ తీసుకున్నారు. అందులో బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులను ఉంచినట్లు ఆమె తెలిపారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్‌ (SBT) కేరళలోని తిరువనంతపురం కేంద్రంగా పనిచేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల్లో ఒకటి. 2017లో ఎస్‌బీటీతో పాటు పలు అనుబంధ బ్యాంకులు ఎస్‌బీఐలో విలీనం అయ్యాయి. దీంతో SBT ప్రత్యేక బ్రాండ్‌గా కొనసాగలేదు. బాధితురాలి భర్త మరణించిన తర్వాత ఆమె లక్నోకు వెళ్లిపోయారు. దీంతో కాన్పూర్‌లోని బ్యాంకు శాఖకు తరచూ వెళ్లి లాకర్‌ను తనిఖీ చేసే అవకాశం లేకపోయింది.

అయితే ఆమె బ్యాంకు ఖాతా నుంచి లాకర్ ఛార్జీలు మాత్రం కొనసాగుతూ ఉండటంతో, లాకర్ కూడా యథావిధిగా కొనసాగుతోందని ఆమె భావించారు. కొంతకాలం తర్వాత లాకర్‌ను తెరిచేందుకు బ్యాంకును సంప్రదించగా, విలీన ప్రక్రియ అనంతరం పాత లాకర్ రికార్డులు వెంటనే అందుబాటులో లేవని బ్యాంకు సిబ్బంది తెలిపారు.

బ్యాంకు అధికారులు సంబంధిత వివరాలను వెతికి రికార్డులను పరిశీలించిన తర్వాత మహిళకు లాకర్‌ను తెరిచే అవకాశం కల్పించారు. కానీ లాకర్ తెరిచి చూసిన ఆమెకు అందులో ఏమీ కనిపించలేదు. తాను దాచిన సుమారు రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు కనిపించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.

మహిళ ఫిర్యాదు ఆధారంగా స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. శాఖ మేనేజర్‌తో పాటు మరికొందరు బ్యాంకు ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో లాకర్‌కు సంబంధించి గతంలో యాక్సెస్ చేసినట్లు సూచించే కొన్ని ఎంట్రీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రస్తుతం దర్యాప్తు అధికారులు అసలు లాకర్‌ను ఎప్పుడు, ఎవరు తెరిచారు? అనే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. దీంతో పాటు బ్యాంకు లాకర్ రికార్డులు, యాక్సెస్ రిజిస్టర్లు, సీసీటీవీ ఫుటేజీ, ఇతర సంబంధిత పత్రాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. లాకర్ నిర్వహణలో రికార్డుల పరంగా ఏమైనా లోపాలు జరిగాయా? భద్రతా వ్యవస్థలో లోపం ఉందా? అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ కేసులో నగలు, విలువైన వస్తువులు ఎలా మాయమయ్యాయనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. లాకర్‌ను ఎవరు యాక్సెస్ చేశారు, ఆ సమయంలో ఏం జరిగింది, బ్యాంకు రికార్డుల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలను పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.

రూ.50 లక్షల విలువైన వస్తువులు లాకర్ నుంచి మాయమయ్యాయన్న మహిళ ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతుండగా, పోలీసుల విచారణ పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags

Be the first to react

Latest