విజయనగరంలో పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్.. రూ.370 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టు!
ఉత్తరాంధ్ర ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఊతమిచ్చేలా మరో కీలక అడుగు పడింది. విజయనగరం జిల్లాలో పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న భారీ ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటించింది.
రైతులకు మార్కెట్, యువతకు ఉద్యోగ అవకాశాలు.. 500 రకాల ఉత్పత్తుల తయారీకి ప్రణాళిక..
ఉత్తరాంధ్రకు కొత్త పారిశ్రామిక బూస్ట్.. పతంజలి మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు..
విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఊతమిచ్చేలా మరో కీలక అడుగు పడింది. విజయనగరం జిల్లాలో పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న భారీ ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటించింది.
కొత్తవలస మండలం చిన్నరావుపల్లి గ్రామంలో సుమారు రూ.370 కోట్ల పెట్టుబడితో ఈ పార్క్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు విలువ ఆధారిత ప్రాసెసింగ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించనుంది.
ఈ ప్రాజెక్టు కోసం ఏపీఐఐసీ (APIIC) ద్వారా పతంజలి సంస్థకు 70 ఎకరాల భూమిని కేటాయించేలా ప్రభుత్వం జీవో నెం.131 జారీ చేసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
వ్యవసాయం, పాడి పరిశ్రమలపై ఆధారపడిన విజయనగరం జిల్లాలో ఈ ప్రాజెక్టు స్థానిక రైతులకు ఎంతో ఉపయోగపడనుంది. గతంలో కూడా పతంజలి సంస్థ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్, ఆయుర్వేద పరిశోధన కేంద్రం, పశు సంవర్ధక కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
2014-19 కాలంలో సుమారు రూ.1000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు వచ్చాయి. అప్పట్లో చిన్నరావుపల్లి గ్రామంలో 172.84 ఎకరాల భూమిని కేటాయించగా, రూ.634 కోట్ల పెట్టుబడి అంచనా వేశారు. పప్పులు, చిరుధాన్యాలు, నిమ్మ, సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసే ప్రణాళిక రూపొందించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 33 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేశారు. అయితే 2019 తర్వాత ఈ ప్రతిపాదన ముందుకు సాగలేదు.
2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పతంజలి సంస్థ ఈ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. 70 ఎకరాల భూమిలో రూ.370 కోట్ల పెట్టుబడితో ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన చేసింది. జూన్ 18, 2026న జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
ఈ పార్క్లో 500కు పైగా రకాల ఆహార, ఆయుర్వేద, హెర్బల్ ఉత్పత్తులు తయారు చేయనున్నారు. ఇందుకు అవసరమైన ముడి పదార్థాలను స్థానిక రైతుల నుంచి సేకరించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ (4.0) 2024-29 కింద పతంజలి సంస్థకు గరిష్టంగా రూ.131.41 కోట్ల వరకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ప్రాజెక్టు స్థిర మూలధన పెట్టుబడిలో సుమారు 39.37 శాతానికి సమానం.
ఈ రాయితీలలో భాగంగా అర్హత కలిగిన పెట్టుబడిపై 25 శాతం వరకు క్యాపిటల్ సబ్సిడీ (రూ.60.65 కోట్ల వరకు), ఐదేళ్ల పాటు యూనిట్కు రూ.1 చొప్పున విద్యుత్ ఖర్చు రీయింబర్స్మెంట్ (రూ.3.25 కోట్ల వరకు), విద్యుత్ డ్యూటీ రీయింబర్స్మెంట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధితో రైతుల ఆదాయం పెరగడంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.