అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న మొన్నటిదాకా విధించిన టారిఫ్ పన్నులు అందరికీ తెలిసిందే. ట్రంప్ చేసిన తాజా ప్రకటన అక్కడ పని చేసే ఉద్యోగులకు భారీ కల్లోలం సృష్టించింది అనే చెప్పుకోవచ్చు. హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతున్నట్టు ప్రకటించడంతో, అమెరికాలో పనిచేస్తున్న టెక్నాలజీ కంపెనీలు వెంటనే ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే కొత్త నిబంధనలు సెప్టెంబర్ 21 అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు. అంటే ఆ గడువు లోపు అమెరికాకు చేరుకోకపోతే, విదేశీ ఉద్యోగులను కొనసాగించాలంటే ఆయా కంపెనీలు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ డెడ్లైన్ ప్రకటించగానే ఎన్ఆర్ఐ లో తక్షణమే భయం చెలరేగింది. అమెరికాలోని అమెజాన్, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గన్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులను అమెరికా నుండి వెళ్ళొద్దని అదేవిధంగా ప్రస్తుతం భారత్ లేదా ఇతర దేశాల్లో ఉన్నవారు వెంటనే తిరిగి రావాలని తెలిపాయి. ఈ కారణంగా భారత్-అమెరికా విమాన టిక్కెట్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగి, ధరలు రెట్టింపయ్యాయి. ఢిల్లీ-న్యూయార్క్ టిక్కెట్ ధరలు రూ.2 లక్షలకు చేరుకున్నాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.
స్వదేశంలో సరదాగా కుటుంబ సభ్యులతో గడపాలనుకొని భారత్ వచ్చిన ఎన్ఆర్ఐ లు, ఇప్పుడు కంగారు పడుతున్నారు. "సెప్టెంబర్ 21 అర్థరాత్రి 12:01 సమయానికి అమెరికాకు చేరుకోని వారంతా సమస్యల్లో పడతారు అని అమెరికా ఇమిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికాకు చేరుకునేందుకు టిక్కెట్లు బుక్ చేసుకోవడం కోసం ఎన్ఆర్ఐ లు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
అమెరికా ఎయిర్పోర్టుల్లోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విమానంలో కూర్చున్న ప్రయాణికులు ట్రంప్ ప్రకటన తెలిసిన వెంటనే దిగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుబాయ్ ఎయిర్పోర్టులో కూడా ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయని అధికారులు తెలుపుతున్నారు.
ఇక టిక్కెట్ ధరల పెరుగుదల వల్ల సాధారణ ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా వచ్చిన ఈ సంక్షోభం వలన అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసినవారు గందరగోళానికి గురవుతున్నారు. ఇకపై ఈ వీసా ఫీజుల భారం కంపెనీలపై ఎంతవరకు పడుతుందో, ఉద్యోగుల భవిష్యత్తుపై ఏమేరకు ప్రభావం చూపుతుందో అన్నదానిపై ఆసక్తిగా చూస్తున్నారు.