ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పంచాయతీరాజ్, పురపాలక శాఖలపై సమీక్ష నిర్వహించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. దుబాయ్లో ఆవుపేడకు డిమాండ్ పెరిగిందని ఆయన పేర్కొన్నారు. మొదట వినగానే ఇది ఆశ్చర్యంగా అనిపించినా… నిజంగానే అక్కడ ఆవుపేడకు గిరాకీ ఎక్కువగా ఉంది.
నిజానికి మనం ఇక్కడ ఆవుపేడను కేవలం ఇంధనం లేదా ఇంటి చుట్టూ ఉపయోగించుకునే పదార్థంగా మాత్రమే భావిస్తాం. కానీ గల్ఫ్ దేశాల్లో దీని విలువ పూర్తిగా వేరే విధంగా ఉంది. ముఖ్యంగా దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలు మన దేశం నుంచి పెద్ద మొత్తంలో ఆవుపేడను దిగుమతి చేసుకుంటున్నాయి.
దీనికి ప్రధాన కారణం అక్కడి వ్యవసాయం. ఎడారి వాతావరణం ఉండటంతో భూమి సారవంతం చేయడం చాలా కష్టం. ముఖ్యంగా ఖర్జూర పంట సాగులో మట్టి సారాన్ని పెంచడం ఒక పెద్ద సమస్య. అక్కడి శాస్త్రవేత్తలు పరిశోధన చేసి, ఆవుపేడను పొడి రూపంలో ఎరువుగా వాడితే పంట దిగుబడి పెరుగుతుందని, ఖర్జూర పండ్ల పరిమాణం కూడా ఎక్కువ అవుతుందని గుర్తించారు.
ఆవుపేడలో ఉండే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు పంటలకు బాగా ఉపయోగపడతాయి. రసాయన ఎరువుల కంటే పర్యావరణహితంగా ఉండటంతో, అక్కడి రైతులు సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించారు. దీంతో ఆవుపేడకు డిమాండ్ మరింత పెరిగింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలోనే మన దేశం నుంచి దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన ఆవుపేడ ఉత్పత్తులు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయినట్లు సమాచారం. అందులో దుబాయ్ ప్రధాన మార్కెట్గా మారింది.
ఇక్కడ మనం వేస్ట్ గా భావించే అక్కడ వెల్త్ గా మారుతోంది. ఇదే నేటి ట్రెండ్ ఏది వృథా కాదు, అన్నీ ఉపయోగకరమే అని చంద్రబాబు గారు చెప్పిన మాటలు వాస్తవమేనని మన రైతులు గ్రహించినప్పుడు ఎటువంటి పెట్టుబడి లేకుండా స్వయం సహాయక సంఘాలు ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటే, ఇది మనకు మంచి ఆదాయం తెచ్చిపెట్టే రంగంగా మారొచ్చు అని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.