‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై ఘాటుగా స్పందించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే మోదీ కొన్ని దేశాల ద్వంద్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ, ఇలాంటి చర్యలను ప్రపంచ సమాజం అంగీకరించాలా? అని మోదీ సూటిగా ప్రశ్నించారు.
సోమవారం టియాంజిన్లో జరిగిన ఎస్సీఓ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన మోదీ.. ఉగ్రవాదం ఏ ఒక్క దేశానికే పరిమితం కాదని, ఇది మొత్తం మానవాళికి పెద్ద సవాలని తెలిపారు. "నాలుగు దశాబ్దాలుగా భారత్ ఉగ్రవాదం బారిన పడుతోంది. పహల్గామ్ దాడి కేవలం భారత్ పై దాడి కాదు.. మానవత్వంపైనే సవాల్" అని మోదీ స్పష్టం చేశారు. ఈ కష్ట సమయంలో భారత్కు అండగా నిలిచిన మిత్రదేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
“ఉగ్రవాదానికి బాహాటంగా మద్దతు ఇస్తున్న దేశాలను సహించరాదు. ద్వంద్వ వైఖరికి తావు లేకుండా మనం ఒక్కటిగా నిలవాలి. ఉగ్రవాద సంస్థలకు నిధులు ఆగిపోవాలి.. వాటిని ప్రోత్సహించే శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని మోదీ పిలుపునిచ్చారు. అలాగే, ఎస్సీఓలో భారత్ విధానం భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే మూడు ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.