ఆంధ్రప్రదేశ్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
పశ్చిమ బెంగాల్–ఒడిశా తీర ప్రాంతాల సమీపంలో వాయవ్య బంగాళాఖాతం మీదుగా 1.5 నుంచి 1.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రేపు (సెప్టెంబర్ 2) నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో తూర్పు గాలులు బలంగా వీచి తీర ప్రాంతాల్లో వర్షాలు మరింత పెరగవచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.
ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపారు. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు.
తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరదల ప్రమాదాలు, విద్యుత్ అంతరాయాలకు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.