పాకిస్థాన్లో ప్రభుత్వం తన సొంత పౌరులపైనే భారీ స్థాయిలో డిజిటల్ నిఘాను కొనసాగిస్తున్నదన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ‘అమ్నెస్టీ ఇంటర్నేషనల్’ తాజాగా విడుదల చేసిన ‘నియంత్రణ నీడ: పాకిస్థాన్లో సెన్సార్షిప్, సామూహిక నిఘా’ అనే నివేదిక ప్రకారం, సుమారు 40 లక్షల మంది పౌరులపై ప్రభుత్వం నిఘా పెట్టినట్లు వెల్లడైంది. చైనా, జర్మనీ, యూఏఈ దేశాలకు చెందిన ప్రైవేట్ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన ఆధునిక టెక్నాలజీని వాడుతూ, ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ వినియోగం, టెక్స్ట్ మెసేజ్లు, లొకేషన్ డేటా వరకు ప్రభుత్వ నియంత్రణలోకి వస్తోందని నివేదిక చెబుతోంది. భద్రత పేరుతో ఈ చర్యలు జరుగుతున్నాయని పాక్ ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ, వాస్తవానికి ప్రతిపక్షాలను అణచివేయడం, విమర్శకులను మౌనం చేయడమే ప్రధాన లక్ష్యమని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నిఘా కోసం ప్రభుత్వం రెండు కీలక సిస్టమ్లను వినియోగిస్తోందని నివేదిక వివరించింది. మొదటిది వెబ్ మానిటరింగ్ సిస్టమ్ (WMS 2.0). ఇది జాతీయ స్థాయి ఫైర్వాల్లా పనిచేస్తూ, ప్రజలు ఉపయోగించే వెబ్సైట్లను, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లు (VPNs)ను, అలాగే ప్రభుత్వానికి నచ్చని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్లాక్ చేస్తోంది. రెండవది లాఫుల్ ఇంటర్సెప్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (LIMS). దీని ద్వారా అధికారులకు పౌరుల ప్రతి కమ్యూనికేషన్పై పర్యవేక్షణ పెట్టే అవకాశం లభిస్తోంది. ఈ టెక్నాలజీని జర్మనీకి చెందిన యుటిమాకో మరియు యూఏఈకి చెందిన డేటాఫ్యూజన్ అనే సంస్థలు అందిస్తున్నట్లు సమాచారం. ఈ విధానాలు పౌరుల వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తున్నాయని మానవహక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులు, సామాజిక కార్యకర్తలే ఈ నిఘాలో ప్రధాన లక్ష్యమని ఆరోపణలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ప్రతిపక్ష నేతల వ్యక్తిగత ఆడియోలు, వీడియోలను లీక్ చేసి వారిని రాజకీయంగా బలహీనపరిచే ప్రయత్నాలు జరిగాయని నివేదిక పేర్కొంది. ఉదాహరణకు, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ (పీటీఐ) మద్దతుదారులు నిరసనలు చేపట్టడంతో ప్రభుత్వం ‘ఎక్స్’ (ట్విట్టర్)ను నిషేధించింది. ప్రజలు VPNల ద్వారా దానిని వాడటం ప్రారంభించడంతో వాటిపైనా నిషేధం విధించింది. అంతేకాకుండా, VPN వాడకాన్ని ఇస్లాం విరుద్ధమని అక్కడి కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ ప్రకటించడం మరింత వివాదాస్పదమైంది.
డిజిటల్ రైట్స్ ఫౌండేషన్ స్థాపకురాలు నిఘాత్ దాద్ మాట్లాడుతూ, “పాకిస్థాన్లో బలమైన డేటా రక్షణ చట్టం లేకపోవడం వల్ల పౌరులు నిరంతరం వేధింపులకు గురవుతున్నారు” అని ఆందోళన వ్యక్తం చేశారు. 1997లోనే పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రభుత్వ నిఘా చట్టవిరుద్ధమని తీర్పు ఇచ్చినా, దాన్ని పట్టించుకోకుండా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. “ఈ అక్రమ నిఘాను అడ్డుకోవడంలో న్యాయవ్యవస్థ, పార్లమెంట్ వంటి కీలక సంస్థలు కూడా విఫలమయ్యాయి” అని బోలో భీ డైరెక్టర్ ఉసామా ఖిల్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు. మొత్తానికి, దేశ భద్రత పేరుతో జరుగుతున్న ఈ చర్యలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.