ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో పాలనా సంస్కరణల దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు అమలులో ఉన్న క్లస్టర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనల మేరకు రూపొందించిన ఈ నూతన పథకాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలు స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా మారనున్నాయి. గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకురావడమే ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పునర్వ్యవస్థీకరణ ప్రకారం, గ్రామ పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించనున్నారు — స్పెషల్, గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3. వీటిలో 10,000 జనాభా మరియు రూ.1 కోటి ఆదాయం కలిగిన పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా వర్గీకరించనున్నారు. పట్టణాలకు సమీప ప్రాంతాల్లో ఉన్న ఈ రూర్బన్ పంచాయతీలకు పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు అందించనున్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో 5,000 జనాభా ఉన్న పంచాయతీలు కూడా ఈ వర్గంలోకి వస్తాయి. ఈ పంచాయతీలు పురపాలక వ్యవస్థ తరహాలో పాలన కొనసాగిస్తాయి.
ఇకపుడు గ్రామ కార్యదర్శుల హోదాను పెంచుతూ, వారిని “పంచాయతీ అభివృద్ధి అధికారి (PDO)”గా మార్చనున్నారు. గ్రేడ్-1 కింద ఉన్న 359 మంది కార్యదర్శులకు డిప్యూటీ ఎంపీడీఓ హోదా ఇవ్వనున్నారు. అంతేకాకుండా 359 మంది జూనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఇచ్చి సీనియర్ అసిస్టెంట్లుగా నియమించనున్నారు. ఈ మార్పులతో గ్రామ పంచాయతీల పరిపాలన మరింత సమర్థవంతంగా, ప్రజలకు చేరువగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఈ సంస్కరణలతో గ్రామ పంచాయతీల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ఇప్పటివరకు సర్పంచ్, కార్యదర్శి, గుమస్తా, పారిశుద్ధ్య కార్మికులకే పరిమితమైన సిబ్బందిని ఇప్పుడు విస్తరించనున్నారు. భవిష్యత్తులో ప్రతి పంచాయతీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, క్లర్క్, శానిటరీ ఇన్స్పెక్టర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వాచ్మెన్, అటెండర్ వంటి పదవులను కూడా సృష్టించనున్నారు. అంతేకాక, కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పవన్ కల్యాణ్ సూచనల మేరకు రూపొందించిన ఈ సంస్కరణలతో గ్రామ పంచాయతీ పరిపాలనలో కొత్త దశ ప్రారంభమవుతుందని ప్రభుత్వం నమ్ముతోంది. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ అభివృద్ధి వేగం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖలో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటు చేయడం కూడా ఈ సంస్కరణలలో భాగంగా ఉంది. ఇది డిజిటల్ పరిపాలనకు మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు.