
విజయవాడ ఉత్సవ్-2025 ఈసారి చరిత్ర సృష్టించింది. మహాత్మా గాంధీ రోడ్డుపై నిర్వహించిన భారీ కార్నివాల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఈ ఘనతను వైబ్రెంట్ ఫర్ సొసైటీ ప్రతినిధులు గిన్నిస్ బుక్ అధికారుల చేతుల మీదుగా సర్టిఫికెట్ రూపంలో స్వీకరించారు. ప్రత్యేకంగా నిర్వహించిన భారీ డప్పు ర్యాలీ ఈ రికార్డు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించింది.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయన తొలుత విజయవాడ ఉత్సవ్ జెండాను ఊపి కార్నివాల్ను ప్రారంభించి, అనంతరం అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 40కిపైగా కళాబృందాల సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించి, నిర్వాహకులను అభినందించారు. ముఖ్యంగా ఈ కార్నివాల్ విజయవాడ ఉత్సవ్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచింది.
కార్నివాల్లో 3 వేలకుపైగా కళాకారులు పాల్గొని, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే అద్భుత ప్రదర్శనలు చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించగా, అమ్మవారి ఊరేగింపు రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కొల్లు రవీంద్ర, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, విజయవాడ ఉత్సవ్ అమరావతికి మణిహారంగా నిలుస్తుందని, మైసూరులో జరిగే దసరా ఉత్సవాల మాదిరిగా ప్రతి యేడాది విజయవాడలో ఈ ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడకు సాంస్కృతిక రాజధానిగా పూర్వ వైభవం తిరిగి తెచ్చే దిశగా సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జ్వరం కారణంగా హాజరుకాలేకపోయారని, అయినా ఆయన ఉత్సవానికి తన ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని కేశినేని పేర్కొన్నారు. ఉత్సవానికి ప్రజల ఆదరణ, కళాకారుల ప్రదర్శనలు, నిర్వాహకుల కృషి కలిసివచ్చి ఈ విజయం సాధించారని హర్షం వ్యక్తం చేశారు.
అదే రోజు ఉత్సవంలో 280 ఈవెంట్లు ఐదు వేదికల్లో కొనసాగాయి. సంప్రదాయ నృత్యాలతో వచ్చిన కళాకారులను ప్రత్యేకంగా సత్కరించారు. వచ్చే ఏడాది మరింత ఘనంగా ఉత్సవాన్ని నిర్వహిస్తామని, విజయవాడ ఉత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేస్తామని నిర్వాహకులు తెలిపారు. మొత్తానికి, విజయవాడ ఉత్సవ్-2025 గిన్నిస్ రికార్డు సాధించడం నగరానికి గర్వకారణంగా నిలిచింది.