రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల సూచనల ఆధారంగా ఈ విలాసవంతమైన భవనాల భవిష్యత్తును నిర్ణయించాలనే లక్ష్యంతో పర్యాటక శాఖ ముందడుగు వేసింది. ఈ భవనాలను ఏ విధంగా ఉపయోగించాలన్నదానిపై ప్రజల అభిప్రాయాలు, సలహాలను ఆహ్వానిస్తూ ప్రత్యేక ఇమెయిల్ చిరునామాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రజలు తమ సూచనలను ఈ మెయిల్ కి పంపించాలని టూరిజం అథారిటీ సీఈవో ఆమ్రపాలి తెలిపారు..
ఆమె మాట్లాడుతూ రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రజల ఆలోచనలు మాకు ఎంతో విలువైనవి. పర్యాటక రంగం వ్యాపారవేత్తలు విద్యార్థులు లేదా సామాన్య పౌరులు ఎవరైనా తమ అభిప్రాయాలను పంపించవచ్చు. అందిన సూచనలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది అని పేర్కొన్నారు.
ఈ రుషికొండ భవనాలు వైసీపీ ప్రభుత్వ కాలంలో సుమారు రూ.452 కోట్ల వ్యయంతో నిర్మించబడ్డాయి. సముద్ర తీరానికి దగ్గరగా పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉండేలా ఈ ప్యాలెస్ను తీర్చిదిద్దినప్పటికీ ఆ సమయంలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై విమర్శలు వచ్చాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ భవనాల వినియోగంపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణ ఖర్చు నెలకు సుమారు రూ.25 లక్షల వరకు ఉందని అధికారులు తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం పెరుగుతుండటంతో ఈ ప్రాజెక్ట్ను సార్వజనిక ప్రయోజనాలకు అనుగుణంగా మార్చే మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రుషికొండ ప్యాలెస్ను పర్యాటక మళ్లీ ప్రారంభించాలా లేక ప్రభుత్వ అతిథి గృహంగా మార్చాలా అనే అంశాలపై చర్చ జరుగుతోంది.
ఈ అంశంపై మంత్రి పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ డోలా బాలవీరాంజనేయస్వామి సభ్యులుగా ఉన్న కేబినెట్ ఉపసంఘం ఇప్పటికే కొన్ని సమావేశాలు నిర్వహించింది. ఈ కమిటీ ప్రజల అభిప్రాయాలతో పాటు జాతీయ అంతర్జాతీయ సంస్థల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోనుంది.
గతంలో రుషికొండ ప్రాంతంలో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఒక రిసార్టు పనిచేసేది. దానివల్ల ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు రూ.7 కోట్ల ఆదాయం వచ్చేది. అయితే ఆ రిసార్టును కూల్చి కొత్త భవనాలను నిర్మించడం వల్ల ప్రస్తుతం ఆ ఆదాయం నిలిచిపోయింది.
ప్రజల నుంచి వచ్చే సలహాలు ఈ ప్యాలెస్ వినియోగంపై తుది నిర్ణయానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అధికారులు తెలిపారు. పర్యాటక శాఖ ఈ సూచనలను అక్టోబర్ నెలాఖరులోగా స్వీకరించి, కేబినెట్ ఉపసంఘానికి నివేదిక సమర్పించనుంది.