వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కీలక అనుచరుడు, మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తురకా కిశోర్ వివాదాస్పదంగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వివిధ కేసుల్లో బెయిల్పై గుంటూరు జైలులో నుంచి నిన్న విడుదలైన ఆయనను వెంటనే మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
జైలు గేటు వద్దే వెల్దుర్తి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, కిశోర్ భార్య సురేఖ, కుటుంబ సభ్యులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే రెంటచింతలలో నమోదైన హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆందోళన కొనసాగుతుండగానే, కుటుంబ సభ్యులను తప్పించి కిశోర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో తురకా సురేఖ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అత్యవసర పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఆర్. రఘునందన్ రావు, జస్టిస్ జె. సుమతిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ తరపున న్యాయవాది రామ లక్ష్మణరెడ్డి వాదిస్తూ.. కిశోర్పై ఇప్పటివరకు 12 కేసులు నమోదు చేశారనీ, ఒక్కో కేసులో బెయిల్ లభించగానే వెంటనే మరోదాంతో అరెస్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇక ప్రభుత్వ న్యాయవాది విష్ణుతేజ వాదిస్తూ.. కిశోర్ను హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేశామని వివరించారు. అయితే, గతేడాది ఏప్రిల్ 8న జరిగిన ఘటనపై ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ను సమర్పించాలంటూ పల్నాడు ఎస్పీకి ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది.