జగన్ పర్యటన అంటేనే అటు అధికారులు... ఇటు స్థానికులు వణికిపోతున్నారు. పోలీసుల ఆంక్షలను పట్టించుకోకపోవడం.. భారీగా జనాన్ని తరలించి బల ప్రదర్శన చేయడం పరిపాటిగా మారింది. ఇప్పటికే అనంతపురం జిల్లా రాప్తాడు, ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా రెంటపాళ్ల, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనల్లో ఆంక్షలను ధిక్కరించారు. నెల్లూరు పర్యటనలోనూ గురువారం అదే పునరావృతం చేస్తున్నారు. జగన్ పర్యటనకు ఇన్ఛార్జి ఎస్పీ దామోదర్ ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హెలిప్యాడ్ వద్ద 10 మంది, జైలు దగ్గర ములాఖత్కు ముగ్గురు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటి దగ్గర 100 మందికి మించి అనుమతించకూడదని స్పష్టంచేశారు.
నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ జగన్ పర్యటనల్లో చోటుచేసుకున్న అలజడుల నేపథ్యంలో ముందస్తు నియంత్రణ చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. జైలులో ఉన్న గోవర్ధన్రెడ్డిని కలిసేందుకు, తర్వాత ఆయన కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ఈ నెల 3నే నెల్లూరుకు జగన్ రావాల్సి ఉంది. అప్పుడు చెముడుగుంటలో హెలిప్యాడ్ ఏర్పాటుకు పోలీసులు స్థలం చూపించారు. అది జైలుకు దగ్గరగా ఉండటంతో.. బల ప్రదర్శనకు అవకాశం ఉండదని వైకాపా నాయకులు భావించారు.
చుట్టూ ముళ్లపొదలు, రెండువైపులా హైటెన్షన్ తీగలున్నాయని, అప్రోచ్ రోడ్డు లేని స్థలాన్ని చూపారంటూ అభ్యంతరం తెలిపారు. వేరేచోట స్థలాన్ని ఇవ్వాలని కోరగా పోలీసులు అనుమతించలేదు. దీంతో జగన్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. అప్పట్లో పోలీసులు చూపిన స్థలంలోనే ప్రస్తుతం హెలిప్యాడ్ ఏర్పాటుకు వైకాపా నాయకులు ఒప్పుకోవడం గమనార్హం. బల ప్రదర్శనకు అనువుగా ఉంటుందని ప్రసన్నకుమార్రెడ్డిని ఆయన ఇంటికే వెళ్లి పరామర్శించేలా పర్యటనను జగన్ సిద్ధం చేసుకున్నారు. జైలు నుంచి బయల్దేరి నెల్లూరులో సుమారు 8 కి.మీ. రోడ్డుమార్గంలో జగన్ ప్రయాణించనున్నారు.
గురువారం ఉదయం 10-10.30 మధ్య చెముడుగుంట సమీపంలోని హెలిప్యాడ్కు జగన్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి జైలుకెళ్లి కాకాణిని కలవనున్నారు. తర్వాత బుజబుజనెల్లూరు, అయ్యప్పగుడి సెంటర్, కరెంటాఫీసు సెంటర్, జీజీహెచ్ మీదుగా సుజాతనగర్ లోని ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి చేరుకుంటారు. ఈ మార్గంలో రాజరాజేశ్వరీ అమ్మవారి దేవస్థానంలో రెండు రోజులుగా పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 11.25 గంటలకు మహాకుంభా షేకం జరగనుంది. జగన్ పర్యటనకు భారీగా జనాన్ని సమీకరిస్తే... ఈ ప్రాంతంలో భక్తులకు నరకం తప్పదు. పక్కనే ప్రభుత్వ సర్వజనాసుపత్రి ఉంది. నిత్యం రోగులు, అత్యవసర చికిత్స కోసం క్షతగాత్రులు వస్తుంటారు. పెద్దఎత్తున ట్రాఫిక్ పెరిగితే వారికీ ఇబ్బందులు తప్పవు.