దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా అప్పుల బరువుతో నలిగిపోతున్నాయని, గత పదేళ్లలో వాటి రుణభారం మూడు రెట్లు పెరిగిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన తాజా నివేదిక స్పష్టం చేసింది. తొలిసారి విడుదల చేసిన దశాబ్ద ఆర్థిక విశ్లేషణలో రాష్ట్రాల బడ్జెట్లలో ఎక్కువ భాగం వడ్డీలు, అప్పుల చెల్లింపులకే వెళ్తోందని పేర్కొంది. ఈ నివేదికను కాగ్ అధిపతి కె.సంజయ్ మూర్తి రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమావేశంలో విడుదల చేశారు.
2013-14 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 28 రాష్ట్రాల మొత్తం అప్పులు రూ.17.57 లక్షల కోట్లు ఉండగా, 2022-23 నాటికి అవి రూ.59.60 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే పదేళ్ల వ్యవధిలో రాష్ట్రాల అప్పులు 3.3 రెట్లు పెరిగినట్టుగా నివేదికలో స్పష్టమైంది. దీనివల్ల రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి, పెట్టుబడుల కోసం కేటాయింపులు తగ్గిపోయి, ఎక్కువ మొత్తంలో వడ్డీలు, రుణ చెల్లింపులకే కేటాయింపులు జరుగుతున్నాయని కాగ్ హెచ్చరించింది.
అప్పులను ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులకు కాకుండా, రోజువారీ ఖర్చులకు, రెవెన్యూ లోటు పూడ్చుకోవడానికే వినియోగిస్తున్నట్లు కాగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు పాటించాల్సిన “గోల్డెన్ రూల్”ను ఉల్లంఘిస్తున్నాయని తేల్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు సహా 11 రాష్ట్రాలు రుణాలను తప్పుగా వినియోగిస్తున్నాయని నివేదికలో పేర్కొంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో నికర రుణాల్లో కేవలం 26 శాతం మాత్రమే మూలధన వ్యయాలకు వెచ్చించబడిందని వివరించింది.
రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)తో పోల్చినప్పటికీ రుణాల నిష్పత్తి ఆందోళనకరంగా పెరుగుతోందని కాగ్ హెచ్చరించింది. 2023 నాటికి పంజాబ్ 40.35% రుణ నిష్పత్తితో అగ్రస్థానంలో ఉండగా, నాగాలాండ్ (37.15%), పశ్చిమ బెంగాల్ (33.70%) కూడా ఎక్కువ రుణ నిష్పత్తితో ఉన్నట్లు తేలింది. మరోవైపు ఒడిశా (8.45%), మహారాష్ట్ర (14.64%), గుజరాత్ (16.37%) రాష్ట్రాలు తక్కువ రుణ నిష్పత్తితో ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నాయని నివేదిక ప్రస్తావించింది. ఈ నివేదికపై కాంగ్రెస్ తీవ్ర ప్రతిస్పందన వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం నిర్బంధ సమాఖ్యవాదం ప్రదర్శిస్తూ రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను హరిస్తోందని ఆరోపించింది. జీఎస్టీ సెస్, ఏకపక్ష పన్నుల విధానం వల్లే రాష్ట్రాలు అప్పులపాలు అవుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా విమర్శలు గుప్పించారు.