ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ రంగాన్ని గ్రామీణ స్థాయికి విస్తరించేందుకు మరో కీలక అడుగు వేసింది. ఇకపై రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగులు తమ సొంత ఊరు, జిల్లాలోనే ఉండి ఉద్యోగాలు చేసుకునే సౌకర్యం కల్పించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మంత్రివర్గం సోమవారం సమావేశమై, “వర్క్స్పేస్ పాలసీ”కి ఆమోదం తెలిపింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ రూపొందించిన ఈ విధానం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఐటీ రంగ అభివృద్ధి సమతుల్యం సాధించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
ప్రస్తుతం నైపుణ్యం ఉన్న అనేకమంది యువత ఉద్యోగాల కోసం నగరాలకు వలస వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గ్రామీణ లేదా మారుమూల ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్, ఆఫీస్ వాతావరణం వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవు. సొంతంగా కార్యాలయం ఏర్పాటు చేసుకునే ఆర్థిక సామర్థ్యం కూడా చాలా మందికి ఉండదు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రతి మండల కేంద్రంలో ఆధునిక సదుపాయాలతో కూడిన “వర్క్స్పేస్ స్టేషన్లు” ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఉద్యోగులు తమ సొంత ప్రాంతంలోనే ఉండి ఉద్యోగాలు చేసుకునే అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా నగరాలపై పడే ఒత్తిడి తగ్గి, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఈ కొత్త విధానం కింద వర్క్స్పేస్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యే వ్యక్తులు, సంస్థలకు ప్రభుత్వం విస్తృతమైన ప్రోత్సాహకాలు అందించనుంది. ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేసే వర్క్స్పేస్లకు ఐదేళ్లపాటు అద్దె మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది. ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేసేవారికి వార్షిక అద్దెపై 50 శాతం సబ్సిడీ, గరిష్ఠంగా రూ.6 లక్షల వరకు సహాయం చేస్తుంది. అంతేకాకుండా “ఎర్లీ బర్డ్ పాలసీ” కింద ముందుగా దరఖాస్తు చేసుకునే వారికి పెట్టుబడిపై 60 శాతం వరకు, గరిష్ఠంగా రూ.15 లక్షల రాయితీ ఇవ్వనుంది. హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఛార్జీలలో కూడా 50 శాతం ప్రభుత్వమే భరించనుంది.
ప్రతి మండల స్థాయిలో ఏర్పాటు చేసే వర్క్స్పేస్ కనీసం 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉండి, 60 మంది వరకు ఒకేసారి పనిచేసే సామర్థ్యం కలిగి ఉండాలి. ఈ వర్క్స్పేస్లలో హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం, బిజినెస్ మీటింగ్ రూములు, స్కానింగ్, ప్రింటింగ్, లాకర్లతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా తప్పనిసరిగా ఉండాలని పాలసీలో పేర్కొంది. అంతేకాకుండా విద్యార్థులు, స్థానిక యువతకు డిజిటల్ నైపుణ్యాలు నేర్పేందుకు ప్రత్యేక శిక్షణా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానంతో ఒకవైపు గ్రామీణ ప్రాంతాల ఆర్థికాభివృద్ధి సాధించబడగా, మరోవైపు ఐటీ రంగంలో వికేంద్రీకరణ కొత్త ఊపును సంతరించుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.