అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో జరుగుతున్న వాణిజ్య ఒప్పందంపై చేసిన తాజా వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలు మరోసారి చర్చకు వచ్చాయి. న్యూయార్క్లోని వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్లో అమెరికా కొత్త రాయబారి సెర్జియో గోర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత అమెరికా మధ్య బహుళ దశల వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఐదు రౌండ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ పరిణామం నేపధ్యంలో భారతదేశంతో న్యాయమైన ఒప్పందానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఈసారి అవి పాత ఒప్పందాల్లా కాదు. ఇప్పుడు వాళ్లు నన్ను అంతగా ఇష్టపడకపోయినా త్వరలో మళ్లీ ఇష్టపడతారు అని ట్రంప్ అన్నారు.
అమెరికా తరపున ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్తో మాట్లాడుతున్నప్పుడు కూడా ట్రంప్ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. స్కాట్, మనం మంచి ఒప్పందానికి దగ్గరలో ఉన్నాం కదా? అని అడిగారు. బెస్సెంట్ ‘‘అవును’’ అని సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఇటీవల ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇటీవలి కాలంలో అమెరికా ప్రభుత్వం భారతదేశంపై భారీ సుంకాలు (టారిఫ్లు) విధించింది. ముఖ్యంగా రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుగోళ్ల నేపథ్యంలో భారతదేశం నుంచి దిగుమతులపై 50 శాతం వరకు సుంకం విధించినట్లు ఆరోపణలు వచ్చాయి. భారత్ దీనిపై గట్టిగా స్పందిస్తూ, ఈ చర్య అన్యాయం, అర్థరహితం అని పేర్కొంది. అయినప్పటికీ తమ దేశ ప్రయోజనాల కోసం అవసరమైన ఇంధనాన్ని ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసుకునే హక్కు భారతదేశానికి ఉందని స్పష్టం చేసింది.
ట్రంప్ వ్యాఖ్యలు ఈ వివాదంపై ఒక మార్పు సంకేతంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండియా రష్యా ఆయిల్ దిగుమతులను భారీగా తగ్గించింది. కాబట్టి భవిష్యత్లో సుంకాలను తగ్గించే అవకాశముంది అని ఆయన చెప్పారు. అయితే సుంకాలు లేకుండా ఉంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం వస్తుందని కూడా హెచ్చరించారు. భారతదేశం వంటి దేశాలతో వాణిజ్యంలో మరింత న్యాయం తీసుకురావటమే లక్ష్యమని తెలిపారు.
ఇదిలా ఉండగా న్యూ ఢిల్లీలోని వాణిజ్య శాఖ వర్గాలు కూడా సమానమైన సంకేతాలే ఇస్తున్నాయి. రెండు పక్షాలూ ప్రధాన అంశాలపై దాదాపు ఒకే దృక్కోణంలో ఉన్నారు. ఇప్పుడు ఒప్పంద భాషపై ఫైనల్ చర్చలు జరుగుతున్నాయి అని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ ప్రకటనలతో ఒప్పందం త్వరలోనే పూర్తి అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఈ వాణిజ్య ఒప్పందం కుదిరితే రెండు దేశాలకూ లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆయిల్, రక్షణ, హైటెక్ రంగాల్లో లాభాల్ని ఆడిస్తుంటే భారత్ వ్యవసాయ–ఔషధ రంగాల్లో సుంకాలు తగ్గుతాయని భావిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలతో ఈ ఒప్పందంపై ఆశలు పెరిగాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు కొత్త దశలోకి వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.