Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక!
Rains: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించిన విపత్తుల నిర్వహణ సంస్థ..
మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
అమరావతి: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఆయన విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ వ్యవస్థ ప్రస్తుతం ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల సమీపంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మత్స్యకారులు ఈ సమయంలో సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
జూలై 3, శుక్రవారం రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణం కొనసాగనుంది. శ్రీకాకుళం, పోలవరం పరిసర ప్రాంతాలు, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు.
వర్షాల సమయంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద, భారీ హోర్డింగుల సమీపంలో నిలబడకూడదని హెచ్చరించింది. అలాగే గాలివానల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడి ఉండే అవకాశం ఉన్నందున అలాంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.
అల్పపీడనం ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో వాతావరణ పరిస్థితులపై ప్రజలు ఎప్పటికప్పుడు అధికారిక హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.
Tags
Be the first to react