Passport: రాజుల అనుమతి లేఖల నుండి బయోమెట్రిక్ పాస్పోర్ట్ వరకు.. పాస్పోర్ట్ ప్రయాణం ఇలా సాగింది!
Passport: విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరికీ ఇప్పుడు పాస్పోర్ట్ అత్యంత కీలకమైన పత్రం. మన గుర్తింపును, మనం ఏ దేశానికి చెందినవారమో నిరూపించే ఈ చిన్న పుస్తకం వెనుక వేల ఏళ్ల చరిత్ర దాగి ఉంది.
చేతిరాత లేఖగా మొదలై.. హైటెక్ పాస్పోర్ట్గా మారిన చరిత్ర..
విదేశీ ప్రయాణానికి గుర్తింపు చిహ్నం.. పాస్పోర్ట్ వెనుక ఆసక్తికర కథ..
న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరికీ ఇప్పుడు పాస్పోర్ట్ అత్యంత కీలకమైన పత్రం. మన గుర్తింపును, మనం ఏ దేశానికి చెందినవారమో నిరూపించే ఈ చిన్న పుస్తకం వెనుక వేల ఏళ్ల చరిత్ర దాగి ఉంది. నేడు ఫొటోలు, బయోమెట్రిక్ చిప్లతో కూడిన ఆధునిక పాస్పోర్ట్గా కనిపిస్తున్న ఈ పత్రం ఒకప్పుడు రాజులు ఇచ్చే అనుమతి లేఖ రూపంలో ఉండేది.
చరిత్రకారుల ప్రకారం, వేల సంవత్సరాల క్రితం ఒక రాజ్యం నుంచి మరో రాజ్యంలోకి వెళ్లాలంటే అక్కడి పాలకుల అనుమతి తప్పనిసరి. ఇలాంటి అనుమతి పత్రం గురించి తొలి ప్రస్తావనల్లో ఒకటి హీబ్రూ బైబిల్లో కనిపిస్తుంది. పర్షియన్ రాజు ఆర్టాక్సెర్క్సెస్-1 వద్ద పనిచేసిన నెహెమ్యా అనే అధికారి తన ప్రయాణంలో సురక్షితంగా వెళ్లేందుకు పొరుగు ప్రాంతాల గవర్నర్లకు రాజు ప్రత్యేక లేఖలు ఇచ్చినట్లు అందులో పేర్కొనబడింది.
కాలక్రమేణా వ్యాపారం, ప్రయాణాలు పెరగడంతో యూరప్లోని రాజులు, పాలకులు వ్యాపారులు, దౌత్యవేత్తలు, రాజదూతలకు ప్రత్యేక అనుమతి పత్రాలు జారీ చేయడం ప్రారంభించారు. ఆ పత్రాల్లో ప్రయాణికుడి వివరాలు ఉండటంతో పాటు, సరిహద్దులు దాటే సమయంలో వారికి రక్షణ కల్పించాలని కోరుతూ సందేశాలు ఉండేవి.
'పాస్పోర్ట్' అనే పదం కూడా అప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకంటే నగర ద్వారాలు లేదా సముద్ర తీర నౌకాశ్రయాల గుండా వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి అవసరమయ్యేది. ఆ అనుమతి పత్రాలకే తర్వాత 'పాస్పోర్ట్' అనే పేరు స్థిరపడింది.
మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం అంతర్జాతీయ ప్రయాణాలు మరింత క్రమబద్ధంగా మారాయి. దీంతో ప్రపంచ దేశాలు ఒకే తరహా పాస్పోర్ట్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. అప్పటి నుంచి పాస్పోర్ట్లలో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు తప్పనిసరిగా చేర్చడం ప్రారంభమైంది.
కాలానుగుణంగా నకిలీలను అరికట్టేందుకు ప్రత్యేక కాగితం, వాటర్మార్క్లు, మెషిన్-రీడబుల్ పేజీలు వంటి భద్రతా సాంకేతికతలను పాస్పోర్ట్లలో ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం అనేక దేశాలు బయోమెట్రిక్ చిప్లతో కూడిన ఈ-పాస్పోర్ట్లను జారీ చేస్తున్నాయి. ఈ చిప్లలో వ్యక్తిగత సమాచారం సురక్షితంగా నిల్వ ఉండటంతో పాటు, విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయాణికుల గుర్తింపును వేగంగా ధృవీకరించే అవకాశం కలుగుతోంది.
ఒకప్పుడు రాజులు ఇచ్చే చేతిరాత అనుమతి లేఖగా ప్రారంభమైన పాస్పోర్ట్.. నేడు అత్యాధునిక సాంకేతికతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భద్రతాయుత ప్రయాణ పత్రంగా రూపాంతరం చెందింది. విదేశీ ప్రయాణంలో ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు.. ప్రతి వ్యక్తి గుర్తింపు, దేశ పౌరసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.
Be the first to react