Nara Lokesh: బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి.. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.. మంత్రి నారా లోకేష్!
Nara Lokesh: బలమైన రాష్ట్రాలే బలమైన దేశ నిర్మాణానికి పునాది అని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్.. పెట్టుబడులకు ఏపీ ప్రత్యేకతలు: లోకేష్..
రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. ఏపీని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతాం..
కోల్కతా: బలమైన రాష్ట్రాలే బలమైన దేశ నిర్మాణానికి పునాది అని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. కోల్కతాలో జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC) ప్లీనరీలో పాల్గొన్న మంత్రి.. ‘‘ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు’’ అనే అంశంపై మాట్లాడారు.
భారతదేశ మేధో, సాంస్కృతిక, ఆర్థిక ప్రగతిలో కోల్కతాకు ప్రత్యేక స్థానం ఉందని మంత్రి పేర్కొన్నారు. ‘‘బలమైన బెంగాల్ అంటే బలమైన భారత్’’ అనే భావనను వ్యక్తం చేస్తూ, దేశ అభివృద్ధికి అన్ని రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని లోకేష్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రితో జరిగిన భేటీని ప్రస్తావిస్తూ.. ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధిపై ఉన్న ఆసక్తిని అభినందించారు. భూమి వంటి అంశాలు ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నప్పటికీ, రైతుల భవిష్యత్, యువతకు ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న సంస్కరణలు రాష్ట్రాల అభివృద్ధికి బలం ఇస్తున్నాయని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కరణల అమలులో ముందంజలో ఉందని, దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో గణనీయమైన వాటా ఏపీకి వస్తోందని తెలిపారు.
పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీకి మూడు ప్రత్యేకతలు ఉన్నాయని మంత్రి వివరించారు. అవి స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అని చెప్పారు.
పెట్టుబడిదారులు కేవలం హామీలను కాకుండా నిర్ణయాల అమలు వేగాన్ని చూస్తారని, అందుకే ఏపీ ప్రభుత్వం ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’ నుంచి ‘‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’ వైపు అడుగులు వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో నిర్ణయాలు వేగంగా తీసుకుని అమలు చేస్తున్నామని తెలిపారు.
13 నెలల్లోనే గూగుల్ వంటి అతిపెద్ద విదేశీ పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకురాగలిగామని, ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్ట్, పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్లో వేగం చూపించామని మంత్రి వివరించారు.
పరిశ్రమలకు ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం అవసరమని, ఆ నమ్మకాన్ని ఏపీ అందిస్తోందని లోకేష్ అన్నారు. ప్రభుత్వం తనను నియంత్రణ సంస్థగా కాకుండా సేవలందించే సంస్థగా భావిస్తోందన్నారు.
‘‘కస్టమర్ ఈజ్ గాడ్’’ అనే భావనతో పెట్టుబడిదారులకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వ్యాపారాలను నిర్మించడం ఎంత కష్టమో తమకు తెలుసని, అందుకే పారిశ్రామికవేత్తల అభివృద్ధిలో భాగస్వాములుగా నిలవాలని కోరుకుంటున్నామని చెప్పారు.
2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, వాటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు, ఆభరణాల తయారీకి పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. జూలైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతోందన్నారు.
విశాఖ ఎకనామిక్ రీజియన్ వేగంగా అభివృద్ధి చెందుతుందని, హైదరాబాద్లో 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని 10 ఏళ్లలో సాధించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
జోన్లు, క్లస్టర్ల విధానంలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, ఎకోసిస్టమ్ నిర్మిస్తున్నామని లోకేష్ తెలిపారు. పెట్టుబడిదారులతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తామని చెప్పారు.
ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం, మంత్రులు, అధికారులు సమష్టిగా కృషి చేస్తున్నారని, సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
Tags
Be the first to react