రాష్ట్రం నుంచి దిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలకు రైళ్లు రాకపోకలు సాగించే కీలకమైన కాజీపేట-బల్లార్ష మార్గంలో ట్రైన్లు వేగంగా పరుగులు పెట్టేందుకు మార్గం సుగమమవుతోంది. ప్రస్తుతం రైల్వే ట్రాక్ రెండు లైన్లలోనే ఉంది. కాగా.. మూడో లైను పనులు 88 శాతం పూర్తయ్యాయి.
మిగతా 12 శాతం పూర్తికాగానే.. నాలుగో రైలు మార్గం పనులు చేపట్టేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. కాజీపేట-బల్లార్ష నాలుగో లైన్కు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే(ఎఫ్ఎల్ఎస్) తాజాగా పూర్తయింది. కీలకమైన 'కాజీపేట-బల్లార్ష' మధ్య నాలుగో రైల్వే లైన్ను మంజూరు చేస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం.
కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పర్యటనలో శంకర్పల్లి-కాజీపేట వరకు విండో ఇన్స్పెక్షన్ చేసిన ఆయన్ను భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసినపుడు.. ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు ఓ ప్రజాప్రతినిధి 'ఈనాడు'కు తెలిపారు. దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్ని దక్షిణాదితో అనుసంధానించే గ్రాండ్ ట్రంక్ రూట్లో కాజీపేట-బల్లార్ష మార్గం ఉంది.
ప్రయాణికుల రైళ్లు, గూడ్స్ బండ్ల రాకపోకలతో ఈ మార్గం రద్దీగా ఉంటోంది. మూడో లైను, నాలుగో లైను పూర్తయితే గూడ్లకు ప్రత్యేక ట్రాక్ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం సికింద్రాబాద్ నుంచి దిల్లీ, చండీగఢ్, జైసల్మేర్, జోధ్పూర్, పట్నా, లఖ్నవూ, అలహాబాద్ వైపు రైలు ప్రయాణం వేగవంతమవుతుంది. సిమెంట్, బొగ్గు రవాణాతో పాటు ఇతర పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతుంది.
మూడో లైను 205 కి.మీ.
పూర్తయింది: 177 కి.మీ.
మార్గం: కాజీపేట-బల్లార్ష
అంచనా వ్యయం: రూ.2,063 కోట్లు
ప్రాజెక్టు స్థితి: 88 శాతం పూర్తి
గతంలోనే రాఘవాపురం- మందమర్రి మధ్యలో మూడో లైను నిర్మాణమైంది.
తెలంగాణలో: మొత్తం 159 కిమీ మార్గం ఇందులో 131 కి. మీ. మేర పనులు పూర్తయ్యాయి. రేచినిరోడ్-బెల్లంపల్లి-మందమర్రి, ఆసిఫాబాద్-సిర్పూర్ కాగజ్నగర్.. మధ్య 28 కి.మీ.ల పనులు వేగంగా సాగుతున్నాయి.
మహారాష్ట్రలో: మొత్తం 46 కిమీ మార్గం. పనులన్నీ పూర్తయ్యాయి.
నాలుగో లైన్ 234 కి.మీ.
మార్గం: కాజీపేట-బల్లార్ష
అంచనా వ్యయం: రూ.3 వేల కోట్లు
తెలంగాణలో 80 శాతం మార్గం.. మిగిలింది మహారాష్ట్రలో ఉంది. తుది సర్వే పూర్తికావడంతో అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను సిద్ధం చేస్తున్నారు. ఆగస్టులో రైల్వేబోర్డుకు సమర్పించనున్నట్లు సమాచారం.