అరేబియా సముద్రంలో ఏర్పడిన 'శక్తి' తుఫాను క్రమంగా బలహీనపడుతోందని... ఇది తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇవాళ (అక్టోబర్ 7, మంగళవారం) ఇది మరింత బలహీనపడనుందని... 12 గంటల్లో అల్పపీడనంగా మారనుందని ఐఎండి తెలిపింది. దీనికి ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు తోడవడంతో భారతదేశంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరిస్తోంది.
మొత్తంగా వాతావరణం వర్షాలకు అనుకూలంగా మారుతోంది... దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉండటం తెలుగు ప్రజలను ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే ఏపీతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి... జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాయి.
ఇలాంటి సమయంలో భారీ వర్షాలు కురిస్తే వరదలు తప్పవు... దీంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. రాబోయే 5-6 రోజులు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు, బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని ఇండియన్ మెటలర్జీకల్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. ముఖ్యంగా ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో అక్టోబర్ 8 నుండి 11 వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలన్నాయని IMD హెచ్చరించింది.

ఇక కోస్తాంధ్ర జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. కాబట్టి ప్రజలు వర్ష సమయంలో చెట్ల కింద, తాత్కాలిక నిర్మాణాల్లో ఉండటం మంచిదికాదని... సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచిస్తోంది ఐఎండి.
తెలంగాణ విషయానికి వస్తే రాబోయే ఐదురోజులు బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. హైదరాబాద్ లో కూడా ఉరుములు మెరుపులతో వాతావరణం కాస్త అలజడిగానే ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వంటి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తమిళనాడులో అక్టోబర్ 07 నుండి 12 వరకు, కేరళ & మాహేలో 07 నుండి 13 వరకు, లక్షద్వీప్ తో పాటు కర్ణాటక తీరప్రాంతాల్లో 07 నుండి 11 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి వెల్లడించింది.
తెలంగాణతో పాటు కర్ణాటకలో రాబోయే ఐదురోజులు ఉరుములు మెరుపులతో వర్షాలు... తమిళనాడు, కేరళ, మాహే, లక్షద్వీప్, కోస్తాంద్ర, యానాం, రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరించింది.