మన స్మార్ట్ఫోన్లో ఉండే GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) మన ఎక్కడ ఉన్నామో కచ్చితంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇది అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాల నుంచి వచ్చే సంకేతాలను అందుకుని, మన ఫోన్ స్థానం (లోకేషన్)ను నిర్ణయిస్తుంది. సాధారణంగా మ్యాప్లు ఉపయోగించడం, ట్రావెలింగ్ సమయంలో దారులు వెతికే సందర్భాల్లో GPS ఎంతో కీలకం అవుతుంది. అయితే ఈ సదుపాయం ఖచ్చితంగా పనిచేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేదా వైఫై అవసరం ఉంటుంది. అందువల్ల ఫోన్ నిరంతరం ఉపగ్రహాలూ, నెట్వర్క్లతో డేటా మార్పిడి జరుపుతూనే ఉంటుంది.
లోకేషన్ సర్వీస్ను ఎప్పుడూ ఆన్లో ఉంచడం వలన మీ ఫోన్ నిరంతరం GPS సిగ్నల్ను ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఫలితంగా ఫోన్ ఎక్కువ శక్తి వినియోగించి బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. ముఖ్యంగా మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా తక్కువ నెట్వర్క్ కవరేజ్ ఉన్న ప్రదేశాల్లో GPS మరింతగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో మీ బ్యాటరీ వినియోగం గణనీయంగా పెరుగుతుంది. సాధారణంగా ఒక గంటలోనే 6% నుంచి 15% వరకు బ్యాటరీ తగ్గిపోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఛార్జింగ్ పదేపదే అవసరమై ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీ ఫోన్లోని బ్యాటరీ ఎక్కువసేపు నిల్వ ఉండాలంటే కొన్ని చిన్న మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా అవసరం లేని యాప్స్కు లోకేషన్ యాక్సెస్ ఇవ్వకపోవడం చాలా అవసరం. ఎందుకంటే కొన్ని యాప్స్ అనవసరంగా బ్యాక్గ్రౌండ్లో GPS వాడుతూ మీ బ్యాటరీని ఖర్చు చేస్తుంటాయి. కాబట్టి మీకు అవసరమైన యాప్లు (ఉదాహరణకు Google Maps, Ola, Swiggy వంటివి)కే లోకేషన్ యాక్సెస్ ఇవ్వాలి. మిగతావన్నీ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే బ్యాటరీ వినియోగం తగ్గిపోతుంది.
ప్రయాణంలో లేదా రోజువారీ జీవితంలో లోకేషన్ సర్వీస్ వాడకాన్ని తెలివిగా నియంత్రించడం అవసరం. మీరు యాప్ ఉపయోగించే సమయంలో మాత్రమే లొకేషన్ ఆన్ చేసి, పని పూర్తయిన తర్వాత వెంటనే ఆఫ్ చేయడం ఉత్తమ పద్ధతి. అలాగే Wi-Fi, మొబైల్ డేటాను కూడా అవసరం ఉన్నప్పుడే వాడాలి. అవసరం లేనిప్పుడు ఇవి ఆఫ్ చేస్తే కూడా బ్యాటరీ ఎక్కువసేపు నిలుస్తుంది. ఈ చిన్న అలవాట్లను పాటిస్తే, మీ స్మార్ట్ఫోన్ బ్యాటరీ ఎక్కువ సమయం పాటు పనిచేసి, ఛార్జింగ్ ఇబ్బందులు తగ్గుతాయి. మొత్తానికి GPS వాడకం అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆన్ చేస్తే బ్యాటరీ లైఫ్ మెరుగుపడుతుంది.