ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు మాజీ రిజిస్ట్రార్లపై హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో జస్టిస్ జి. రామకృష్ణ ఈ ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ కౌన్సిల్ డీవీ సీతారామమూర్తి, న్యాయవాది అశ్వినీకుమార్ వాదనలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. మాజీ రిజిస్ట్రార్లు వెలగపూడి ఉమామహేశ్వరరావు, కె. నిరంజన్, వడ్డాది కృష్ణమోహన్ కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతోనే ఈ చర్య చేపట్టారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల విభాగానికి చెందిన ముగ్గురు అధ్యాపకులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని 2011లో హైకోర్టును ఆశ్రయించారు. 2016లో కోర్టు వీరిని బడ్జెట్ ఖాళీలలో రెగ్యులరైజ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, అప్పటి వీసీ జి.ఎస్.ఎన్.రాజు కూడా త్వరితగతిన అమలు చేయాలని చెప్పినా, రిజిస్ట్రార్లు ఆ ఆదేశాలను నిర్లక్ష్యం చేశారు. అంతేకాకుండా ఫుల్ బెంచ్, సుప్రీంకోర్టు వరకు వెళ్లి, అక్కడ కూడా యూనివర్సిటీ వాదనలు తిరస్కరించబడ్డాయి.
తరచూ కోర్టు ఆదేశాలు వచ్చినా అమలు చేయకపోవడంతో, ఉద్దేశ్యపూర్వకంగా ఆదేశాలను పట్టించుకోలేదని భావించిన హైకోర్టు, ఆగస్టు 14న వ్యక్తిగత హాజరు కావాలని ఆదేశించింది. కానీ హాజరుకాకపోవడంతో చివరకు ముగ్గురు మాజీ రిజిస్ట్రార్ల అరెస్టుకు కోర్టు వారెంట్ జారీ చేసింది.