జున్ను తెలియని వారు బహుశా నేటి సమాజంలో ఎవ్వరూ ఉండరు ఏమో. కాకపోతే తరచుగా జున్ను తినకపోవచ్చు. కొంతమంది అయితే అధిక ధర పెట్టి జున్నుపాలను కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ మధ్యకాలంలో జున్ను పాలు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు.
జున్ను రుచి మాత్రం అస్సలు మర్చిపోలేరు. ఆవు లేదా గేదె ఈనిన తర్వాత వచ్చే మూడు రోజుల్లో వచ్చే పాలనే జున్ను పాలు అంటారు. ఈ తొలి పాలను ఉడికించి చేసే ఈ జున్ను, పల్లె వంటింటి ప్రత్యేకత. పాత తరం దీన్ని ఆరోగ్యానికి మంచిదని చెప్పినప్పటికీ, ఆధునిక పరిశోధనలు కూడా అదే చెబుతున్నాయి జున్ను అంటే నిజంగా సూపర్ ఫుడ్ అని నిపుణులు అంటున్నారు.
ఆవు లేదా గేదె నుంచి తొలి మూడు నాలుగు రోజుల్లో వచ్చే పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు విపరీతంగా ఉంటాయి. అందుకే సాధారణ పాలకంటే జున్నులో మూడు రెట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సరిపోయే సహజ ఆహారం.
జున్నులో ఉన్న ప్రోటీన్ కండరాలకు బలం ఇస్తుంది. వ్యాయామం చేసే వారికి ఇది సహజ ఎనర్జీ సప్లిమెంట్లా పనిచేస్తుంది. అంతేకాదు, ఇందులోని విటమిన్లు, మినరల్స్ మెదడు కణజాలాన్ని ఉత్తేజపరచి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
కాల్షియం పుష్కలంగా ఉండే జున్ను ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. పెరుగుతున్న పిల్లలకైనా, వయసులో పెద్దవారికైనా ఇది సరైన ఆహారం. ఎముకల బలహీనత, దంతాలకు జున్ను అద్భుతమైన పోషక విలువలను అందిస్తుంది.
ఫైబర్ మరియు మంచి బ్యాక్టీరియా సమతౌల్యం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అదీ కాక, ఇందులోని కొన్ని పోషకాలు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
జున్ను తినేటప్పుడు జాగ్రత్తలు
అన్ని ఆహారాల్లాగే దీనికీ కొంత జాగ్రత్త అవసరం. ఉడకని జున్ను తినడం వలన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వేడి వాతావరణంలో అయితే ఫ్రిజ్లో నిల్వ చేయడం మంచిది. అలాగే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
ముఖ్యంగా గుర్తుంచుకోవాలి — దొరికింది కదా అని అధికంగా తినడం మంచిది కాదు. మితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
జున్ను తయారు చేసే విధానం
కావలసిన పదార్థాలు:
జున్ను పాలు
సాధారణ పాలు
బెల్లం
యాలకులు
మిరియాలు
తయారీ విధానం:
1. ముందుగా జున్ను పాలను ఒక గిన్నెలో తీసుకోండి.
2. ఒక గ్లాసు జున్ను పాలకు రెండు గ్లాసుల సాధారణ పాలు కలపాలి.
3. యాలకులు, మిరియాలు కాస్త దంచి ఆ మిశ్రమంలో వేయాలి.
4. బెల్లం వేసి కాసేపు కలుపుతూ ఉండాలి.
5. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, ఆ గిన్నెను కొంచెం నీరు ఉన్న పెద్ద గిన్నెలో ఉంచి, మూత పెట్టి 45 నిమిషాలు మధ్య మంటపై ఉడికించాలి.
6. తరువాత జున్ను చల్లారిన తర్వాత రుచి చూడండి – ఆరోగ్యవంతమైన పల్లె రుచిని ఆస్వాదించండి!
గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా తీసుకోవాలంటే, ముందుగా మీ వైద్యుని సంప్రదించడం మంచిది.