భారతదేశం బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాలలో ఒకటి అయినప్పటికీ, భూగర్భ నిల్వల జాబితాలో మాత్రం లేదు. అంటే మన దేశంలో బంగారం పట్ల ప్రేమ, ఆరాధన ఎంతగా ఉన్నా సహజ వనరుల పరంగా మాత్రం మనం వెనుకబడి ఉన్నాం.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక భూగర్భ బంగారు నిల్వలు భారత్లో కాకుండా జనాభా తక్కువగా ఉన్న కొన్ని దేశాల భూముల్లో దాగి ఉన్నట్లు తేలింది.
ఆ నివేదిక ప్రకారం, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,44,000 మెట్రిక్ టన్నుల బంగారం కనుగొనబడింది. ఇందులో 1,87,000 టన్నులు ఇప్పటికే వెలికితీయగా, ఇంకా 57,000 టన్నులు భూగర్భంలో మిగిలి ఉన్నాయని అంచనా.
ఆశ్చర్యం ఏమిటంటే ఈ భారీ నిల్వలలో ప్రధాన భాగం ఆస్ట్రేలియా, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా వంటి దేశాల్లోనే ఉందట.
ఆస్ట్రేలియా మొదటి స్థానం
బంగారం నిల్వల్లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. భూగర్భంలో సుమారు 12,000 మెట్రిక్ టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. దాని విలువ దాదాపు 720 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఆ దేశంలోని వెస్ట్రన్ ఆస్ట్రేలియా, కల్గూర్లీ, న్యూ సౌత్ వేల్స్ ప్రాంతాలు ప్రధాన బంగారు గనుల కేంద్రాలు.
రష్యా రెండో స్థానంలో
రష్యా కూడా దాదాపు 12,000 టన్నుల బంగారంతో రెండో స్థానంలో ఉంది. అక్కడి సైబీరియా, మాగడాన్, క్రాస్నోయార్స్క్ ప్రాంతాలు బంగారం తవ్వకాల ప్రధాన కేంద్రాలు. రష్యా తన బంగారం నిల్వలను డాలర్ ఆధారిత వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా వినియోగించుకునే వ్యూహం పాటిస్తోంది.
దక్షిణాఫ్రికా, అమెరికా, ఇండోనేషియా టాప్ 5లో
ఒకప్పుడు ప్రపంచ బంగారపు రాజ్యంగా పేరొందిన దక్షిణాఫ్రికా ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. అక్కడ సుమారు 3,200 టన్నుల భూగర్భ బంగారం ఇంకా మిగిలి ఉందని నిపుణులు చెబుతున్నారు. జొహన్నెస్బర్గ్ సమీపంలోని గోల్డ్ రీఫ్ ప్రాంతం ఇప్పటికీ ప్రసిద్ధి గాంచిన గని కేంద్రం.
అమెరికాలో సుమారు 3,000 టన్నుల బంగారం నిల్వలుండగా, నెవాడా రాష్ట్రం ఒక్కటే దేశ బంగారం ఉత్పత్తిలో 75 శాతం వాటా కలిగి ఉంది. ఇండోనేషియాలో కూడా దాదాపు 3,600 టన్నుల బంగారం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద గనులలో ఒకటైన గ్రాస్బర్గ్ మైన్ (Grasberg Mine) అక్కడే ఉంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారం. కేంద్ర బ్యాంకులు కూడా తమ ఆర్థిక భద్రత కోసం బంగారాన్ని రిజర్వ్గా ఉంచుకుంటున్నాయి. భూగర్భంలో దాగి ఉన్న ఈ బంగారం భవిష్యత్ ప్రపంచ ఆర్థిక దిశను నిర్ణయించగలదని నిపుణులు చెబుతున్నారు