ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతిని జాతీయ రహదారి (NH-16)తో కలుపుతూ సీడ్ యాక్సెస్ రోడ్డును (E3) రాజమార్గ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 21 కిలోమీటర్ల పొడవున ఈ రోడ్డును అమరావతి అభివృద్ధి సంస్థ (ADCEL) ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు రాజధాని ప్రాంతానికి ప్రాణాధారంగా ఉండబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు మళ్లీ వేగం అందుకున్నాయి. మొదటి దశ ఇప్పటికే పూర్తయింది. రెండో దశలో పనులు పురోగమిస్తున్నాయి. తాజాగా ఫేజ్-3 నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించడం ప్రాజెక్ట్ వేగాన్ని మరింత పెంచింది.
మూడో దశలో ఉండవల్లి పంపింగ్ స్టేషన్ నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు జాతీయ రహదారి 16తో కలిసే 4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులో ఆరు వరుసల ఫ్లైఓవర్, అండర్పాస్లు, సర్వీస్ రోడ్లు వంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉన్న మూడు పెద్ద కాల్వలు, విజయవాడ మెయిన్ రైల్వేలైన్, కొండప్రాంతాలు వంటి భౌగోళిక సవాళ్లను అధిగమించేందుకు ఎలివేటెడ్ నిర్మాణం అవసరమైందని అధికారులు చెబుతున్నారు. రెండు సంవత్సరాల్లో ఈ దశ పనులు పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
వెంకటపాలెం నుంచి ఉండవల్లి పంపింగ్ హౌస్ వరకు 6 కిలోమీటర్ల మేర రెండో దశ పనులు సాగుతున్నాయి. అయితే భూసేకరణ సమస్యలతో కొంతకాలం నిలిచిపోయిన పనులు ఇప్పుడు వేగం అందుకున్నాయి. ఉండవల్లి ప్రాంతంలో రైతులు మొదట భూములు ఇవ్వడానికి నిరాకరించగా, మంత్రి నారా లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన సూచనలతో టీడీపీ స్థానిక నాయకులు రైతులను ఒప్పించగా, అధికారులు జరిపిన చర్చలు ఫలితాన్నిచ్చాయి. ఇటీవల రైతులు తమ అంగీకార పత్రాలను సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు అందజేశారు. దీంతో రెండో దశ పనులకు పూర్తి లైన్ క్లియర్ లభించింది.
సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తయితే అమరావతి రాజధాని ప్రాంతం విజయవాడ, గుంటూరు, మంగళగిరి నగరాలతో వేగవంతమైన కనెక్టివిటీ పొందుతుంది. ఈ రోడ్డుతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు, భవిష్యత్తులో పరిశ్రమలు, ఆఫీస్లు, హౌసింగ్ ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అమరావతిని స్మార్ట్ రాజధానిగా తీర్చిదిద్దే దిశలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.