79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్తో వచ్చింది. "ఫ్రీడమ్ సేల్" పేరుతో దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై భారీ తగ్గింపులు ప్రకటించింది.
ఈ ఆఫర్లో భాగంగా దేశీయ ప్రయాణ టికెట్లు కేవలం రూ.1,279 నుంచి, అంతర్జాతీయ టికెట్లు రూ.4,279 నుంచి ప్రారంభమవుతాయి. మొత్తం 50 లక్షల సీట్లు ఈ ప్రత్యేక ధరలకు అందుబాటులో ఉన్నాయి.
టికెట్ బుకింగ్లు ఆగస్టు 15 వరకు కొనసాగుతాయి. బుకింగ్ చేసిన ప్రయాణికులు 2025 ఆగస్టు 19 నుంచి 2026 మార్చి 31 మధ్య ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. దీంతో ఓనం, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగలకు ముందుగానే ప్లాన్ చేసుకునే వీలు లభిస్తుంది.
వివిధ ఛార్జీల ఆప్షన్లలో "ఎక్స్ప్రెస్ లైట్" (జీరో చెక్-ఇన్ బ్యాగేజ్ ఛార్జీలు), "ఎక్స్ప్రెస్ వ్యాల్యూ", "ఎక్స్ప్రెస్ బిజ్" (బిజినెస్ క్లాస్) సేవలు ఉన్నాయి. ఇటీవల కొనుగోలు చేసిన 40కి పైగా కొత్త విమానాల్లో ప్రీమియం సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం సంస్థ 116 విమానాలతో దేశీయంగా 38, అంతర్జాతీయంగా 17 గమ్యస్థానాలకు రోజూ 500కు పైగా సర్వీసులు అందిస్తోంది.