రాయలసీమకు జీవనాడిగా నిలిచిన హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో కృష్ణా జలాల ఉప్పొంగిన ప్రవాహం రైతుల్లో ఆనందం నింపగా, ఆ దృశ్యాలు చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ – “ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూడగానే హృదయం పులకరించింది. ఈ సీజన్లో ప్రాజెక్టు కింద చివరి ఆయకట్టు భూముల వరకు నీరందించాలన్న మన కల సాకారమవుతోంది” అని పేర్కొన్నారు.
హంద్రీ–నీవా ద్వారా రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆ దిశగా రికార్డు సమయంలో కాల్వల విస్తరణ పనులు పూర్తి చేశామని, దాని ఫలితంగానే ప్రస్తుతం కాల్వల్లో నీటి ప్రవాహం అత్యధిక స్థాయిలో కొనసాగుతోందని తెలిపారు.
"ప్రతి ప్రాజెక్టు, ప్రతి చెరువు నింపి, చివరి భూమి వరకూ నీరు చేరాలన్నదే మా ఆశయం" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రవాహం రైతుల ఆకాంక్షలను నెరవేర్చుతోందని, వారి ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం ప్రభుత్వ సంకల్పానికి మరింత బలం ఇస్తోందని పేర్కొన్నారు.