Janhvi Kapoor: జాన్వీ కపూర్ తప్పు లేదు.. ‘పెద్ది’ కెమెరా యాంగిల్స్ వివాదంపై నటి మేకప్ ఆర్టిస్ట్ సంచలన పోస్ట్!
Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 236 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ.. హీరోయిన్ జాన్వీ కపూర్ (అచ్చియమ్మ పాత్ర)ను చూపించిన విధానంపై వివాదం మాత్రం సలసలా మరుగుతూనే ఉంది.
- షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో సదరు జూమ్ షాట్లపై జాన్వీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెల్లడి..
- Enetertainment: ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ను అతిగా గ్లామరైజ్ చేయడంపై కొనసాగుతున్న వివాదం..
జాన్వీ కపూర్తో చాలా కాలంగా అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్న సవ్లీన్ కౌర్.. తన అధికారిక ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఈ విషయమై సుదీర్ఘంగా స్పందిస్తూ నటి వైఖరిని సమర్థించారు. సాధారణంగా తెరపై హీరోయిన్లు చేసే గ్లామర్ పాత్రలను బట్టి లేదా వారు కనిపించే విధానాన్ని బట్టి సమాజంలో వారిని తప్పుబట్టడం చాలా సులువు అని, కానీ తెరవెనుక ఒక సినిమా నిర్మాణ సమయంలో అసలు ఏం జరిగిందనే వాస్తవ టైమ్లైన్ పూర్తిగా వేరేలా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. గతంలో షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కాకుండా, ఆ తర్వాత జరిగిన పోస్ట్ ప్రొడక్షన్ (డబ్బింగ్, ఎడిటింగ్) దశలోనూ తన శరీరావయవాలను జూమ్ చేసి చూపే సదరు కెమెరా యాంగిల్స్ పట్ల జాన్వీ కపూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని సవ్లీన్ వెల్లడించారు. ఒక ప్రొఫెషనల్ నటిగా ఇండస్ట్రీలో నటీనటుల ఆత్మగౌరవానికి ఉండాల్సిన హద్దుల గురించి, వ్యక్తిగత సౌకర్యం గురించి ఆమె మేనేజ్మెంట్తో గట్టిగానే మాట్లాడిందని స్పష్టం చేశారు.
ఈ వివాదం సోషల్ మీడియాలో మరింత ముదరడంతో నటి భద్రత, గౌరవానికి భంగం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత చిత్ర బృందంపై ఉందంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. గతంలోనే దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ వివాదానికి సంబంధించి క్షమాపణలు చెబుతూ వివాదాస్పద సీన్లను రీ-ఎడిట్ చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ అంతర్గత విషయాలను లీక్ చేయడంతో చిత్ర యూనిట్ వైఖరిపై సరికొత్త విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక స్టార్ హీరోయిన్ అంతగా అభ్యంతరం వ్యక్తం చేసినా, తోటి నటుడు రామ్ చరణ్ అండగా నిలిచినా కూడా ఎడిటింగ్లో ఆ సీన్లను ఎందుకు తొలగించలేదనే ప్రశ్నలు టాలీవుడ్లో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సవ్లీన్ కౌర్ చేసిన ఈ ఇన్స్టాగ్రామ్ వ్యాఖ్యల స్క్రీన్షాట్లు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుండగా, దీనిపై అటు మైత్రీ మూవీ మేకర్స్ కానీ, ఇటు జాన్వీ కపూర్ కానీ అధికారికంగా ఎలా స్పందిస్తారనేది సినీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
రామ్ చరణ్ సపోర్ట్.. లీకైన చాట్స్
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. షూటింగ్ సమయంలో నడుము, నాభి భాగాలపై జూమ్ షాట్లు తీస్తున్నప్పుడు జాన్వీ కపూర్ అసౌకర్యానికి గురైందని, ఆ సమయంలో కో-స్టార్ రామ్ చరణ్ కూడా ఆమెకు మద్దతుగా నిలిచి దర్శకుడితో మాట్లాడారని తెలుస్తోంది. అయినప్పటికీ, జాన్వీ మాటలను పక్కనపెట్టి ఫైనల్ ఎడిటింగ్లో ఆ సీన్లను అలాగే ఉంచేశారని, సినిమా విడుదలయ్యాక వివాదం రేగడంతో ఇప్పుడు ఆ తప్పు నటిపైకి నెట్టేలా ప్రచారం సాగుతోందని సవ్లీన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన కొన్ని లీకైన వాట్సాప్ చాట్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సినిమా జూన్ 4న విడుదలైన తర్వాత మహిళలను ఇలా అందాల వస్తువుగా చూపించడంపై నటి నిత్య మీనన్ వంటి తారలు కూడా విమర్శలు గుప్పించారు. వివాదం ముదరడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా ఇప్పటికే ప్రేక్షకులకు బహిరంగ క్షమాపణలు చెప్పి, థియేటర్ల నుండి దాదాపు 3 నిమిషాల అభ్యంతరకర సీన్లను తొలగించారు. కాగా, ఈ వివాదంపై జాన్వీ కపూర్ ఇప్పటివరకు నేరుగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Be the first to react